Viral: ఏపీలో ఒక బాలిక అనూహ్యమైన ప్రతిభను కనబరిచింది. ఆరవ తరగతి చదువుతున్న బాలిక టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులతో పాసైంది. అదేంటి ఆరవ తరగతి చదివే బాలిక పదవ తరగతి పరీక్షల్లో పాస్ అవ్వడమేంట అని అనుకుంటున్నారా. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గాంధీనగర్ కు చెందిన ముప్పల సురేష్, మణి దంపతులకు హేమశ్రీ అనే కూతురు ఉంది. హేమశ్రీ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హేమశ్రీ వయసుకు మించిన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎప్పుడు చదువులో ఎంతో చురుగ్గా ఉండే హేమ శ్రీ మెమోరీ పవర్ విషయంలో హేమశ్రీ ముందు ఉండేది. దాంతో ఆమె తెలివితేటలకు ఆ స్కూల్లో పోటీ లేకుండా పోయింది. ఈ బాలిక ప్రతిభ ఆనోటా ఈ నోటా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మార్చి 27న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బాలిక తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె ప్రతిభకు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అంతేకాకుండా హేమశ్రీని టెన్త్ పరీక్షలు రాయటానికి అనుమతి కూడా ఇచ్చారు. గత మే నెలలో హేమశ్రీ టెన్త్ విద్యార్థులతో పాటు టెన్త్ పరీక్షలు రాసింది. శనివారం టెన్త్ పరీక్షల ఫలితాలు రాగా అందులో ఆమెకు 488 మార్కులు వచ్చాయి.
దీంతో హేమశ్రీ సాధించిన విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆరవ తరగతి చదివే బాలిక పదవ తరగతి పరీక్షలు రాసి అన్ని మార్కులు సాధించడంతో ఆ విద్యార్థిని ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలిక సాధించిన ఘనత పట్ల ఆమె తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఏపీలో ఫలితాలు విడుదల కాగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలికలే పైచెయ్యి సాధించారు. బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 2,22,976 మంది పరీక్షల్లో పాసయ్యారు. బాలురు 69.27 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 2,14,220 మంది బాలురు పరీక్షల్లో పాసయ్యారు. ఇక, పది పరీక్ష ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం మొదటిస్థానంలో ఉండగా 60.39 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.