Triple Century: టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ గురించి ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. భారత ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు కరుణ్ నాయర్ మాత్రమే. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కరుణ్ నాయర్ ఈ ఘనతను అందుకున్నాడు. దాంతో అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. టీమిండియాలోకి మరో సెహ్వాగ్ వచ్చాడని అందరూ ప్రశంసించారు.
అయితే స్టార్ క్రికెటర్గా ఎదుగుతాడని భావించిన కరుణ్ నాయర్కు ప్రస్తుతం జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. సెలక్టర్లు అతడిని కనీసం పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో మరో క్రికెటర్ తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. గత ఐదేళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కరుణ్ నాయర్ వైఫల్యం వెనుక టీమిండియా సెలక్టర్లు తీరు కూడా కారణమే అన్న విమర్శలు ఉన్నాయి. టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడికి సెలక్టర్లు సరైన అవకాశాలు ఇవ్వలేదు. ఈ విషయం గురించి గతంలో చీఫ్ సెలెక్టర్గా ఉన్న తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా తన పదవి కాలంలో కరుణ్ నాయర్కు న్యాయం చేయలేకపోవడం అత్యంతగా బాధపెట్టే అంశమని పేర్కొన్నాడు.
మరో అవకాశం లభిస్తుందా?
2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ అదే ఏడాది ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్కు మూడంటే మూడు టెస్ట్ మ్యాచ్లలో మాత్రమే అవకాశం ఇచ్చి సెలక్టర్లు పక్కన పెట్టేశారు. 2017లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో విఫలం కావడంతో వేటు వేశారు. తన చివరి మ్యాచ్ను కరుణ్ నాయర్ 2017లో ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కాగా త్వరలోనే కరుణ్ నాయర్కు అవకాశం వస్తుందని అభిమానులు అతడికి ధైర్యం చెప్తున్నారు.