Hero Siddharth: విభిన్న భాషల్లో హీరోగా రాణిస్తున్న సిద్ధార్థ్.. తాజాగా తమిళ భాషలో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. అనేక వెబ్ సిరీస్లలోనూ నటించిన సిద్ధార్థ్.. తెలుగులో బొమ్మరిల్లు మూవీతో బాగా పాపులర్ అయ్యాడు. నువ్వొస్తానటే నేనొద్దంటానా.. చిత్రం కూడా మంచి హిట్ కొట్టింది. తర్వాత తెలుగులో నటించడం బాగా తగ్గించేశాడు. చివరి సారిగా మాహాసముద్రం అనే సినిమాలో ఓ హీరోగా నటించాడు. అనంతరం ప్రస్తుతం తమిళనాట బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు.
తాజాగా సిద్ధర్థ్, అతడి ఫ్యామిలీకి ఓ అవమానం జరిగిందట. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ్, అతడి తల్లిదండ్రులతో కలిసి మధురై విమానాశ్రయంలో ఫ్లైట్ దిగాడు. అయితే, బయటకు నడుచుకుంటూ వస్తుండగా.. ఎయిర్ పోర్ట్ లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది వీళ్లను అడ్డగించారు. సిద్ధార్థ్ తల్లిదండ్రుల జేబులు, బ్యాగుల్లో ఉన్న డబ్బు, ఇతర వస్తువులను బయటకు తీయాలని హుకుం జారీ చేశారు.
అకారణంగా హిందీలో తిడుతూ రెచ్చిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతోందో కాసేపు సిద్ధార్థ్కు అర్థం కాలేదు. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియక.. హీరో సిద్దార్థ్ వారిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించాడు. ఇంగ్లిష్లో మాట్లాడదాం అని కోరగా.. దానికి వారు తిరస్కరిస్తూ.. హిందీలో తిట్టడం మొదలు పెట్టారు. సిద్ధార్థ్ మాటలు వినకుండా అరుస్తూ గట్టిగట్టిగా మాట్లాడారు.
వారిపై చర్యలు తీసుకోవాలి..
ఈ మేరకు హీరో సిద్ధార్థ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులతో పాటు తనను కూడా సీఆర్పీఎఫ్ సిబ్బంది అవమానించారని, తనని వేధింపులకు గురిచేశారని సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఎయిర్ పోర్టులో విధుల్లో ఉన్న సీఆర్ఫీఎఫ్ సిబ్బంది.. ఎలాంటి పనిచేయకుండా తమపై అధికారాన్ని చూపించారని సిద్ధార్థ్ మండిపడ్డాడు. ఈ విషయంపై ఎయిర్పోర్టు ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చానని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.