కానీ ఎవరు ఊహించని విధంగా గత నెల ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు తారకరత్న. భర్త మరణవార్తను జీవించుకోలేకపోతోంది అలేఖ్యా రెడ్డి. తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలోనే భర్త తారకరత్నను తలుచుకొని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యా. నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది.. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉన్నాయి. మన పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ ప్రయాణంలో నేను కొంత బెరుకుగా ఉన్నా నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నామంటూ ఎంతో నమ్మకంగా ఉన్నావు.
అప్పటి నుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాడావు. చివరికి మన పెళ్లి జరిగింది. అయినా ఈ వివాహంపై ఒక గందరగోళం. మనపై వివక్ష.. అయినప్పటికీ నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నిషిక పుట్టిన తర్వాత మన జీవితమే మారిపోయింది. మన ఆనందం రెట్టింపు అయ్యింది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాము. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి. 2019లో కవలల జననంతో నీ కల నిజమయ్యింది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెలో ఉన్న బాధ ఎవరికీ అర్థం కాలేదు సరికదా కనీసం దాన్ని పట్టించుకోలేదు. మనకు బాగా కావాల్సినవాళ్లే మన మనసుకు పదేపదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు సపోర్ట్గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోయాం. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం. నువ్వు రియల్ హీరో నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది అలేఖ్యా రెడ్డి.