Allu Arjun-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్దాదా ఎంబీబీఎస్, అందరివాడు, శంకర్దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలతో వీరిద్దరి కాంబినేషన్ అంటే బ్లాక్బస్టర్ సాంగ్స్ గ్యారంటీ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీకి కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ నుంచి పార్టీ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అయితే బుధవారం విడుదల చేసిన బాస్ పార్టీ సింగ్పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ నుంచి ఈ పాట ఆశించిన రీతిలో లేదని సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట ట్యూన్ తమిళంలోని శింబు సినిమాలో నుంచి డీఎస్పీ కాపీ చేశాడని ఆరోపిస్తున్నారు. మెగాస్టార్ రేంజ్కు ఈ పాట సరిపడా లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయని… బాస్ సినిమాకు అలాంటి పాటలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
తెరపైనే చిరంజీవి కనిపిస్తూ స్టెప్పులు వేస్తుంటే ఈలలతో థియేటర్ దద్దరిల్లిపోయేలా పాట ఉండాలి కానీ లుంగీ ఎత్తుకో.. షర్టు ముడి వేసుకో అంటూ పాటకు బాణీలు సమకూర్చడం సబబుగా లేదని మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ పాటను దేవిశ్రీనే రాసి.. అతడే పాడి.. అతడే స్వరపరిచాడంటే ఇంకా ఎలా ఉండాలని.. కానీ మాస్ ప్రేక్షకులు ఊగిపోయేలా ఈ సాంగ్ లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
బన్నీకి అలా.. బాస్కు ఇలా..
అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య 2, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, పుష్ప సినిమాలకు అదిరిపోయే రీతిలో దేవిశ్రీప్రసాద్ పాటలు అందించాడని మెగా అభిమానులు గుర్తుచేస్తున్నారు. కానీ చిరంజీవి నటించిన శంకర్దాదా సిరీస్, ఖైదీనంబర్ 150 తప్పితే మిగతా సినిమాలకు తూతూ మంత్రంగా దేవిశ్రీ పాటలు ఇచ్చాడని మండిపడుతున్నారు. టాలీవుడ్తో తమన్ నెమ్మదిగా అగ్రస్థానానికి చేరుకుంటుంటే.. దేవి ఇలా తన బాణీలను తానే కాపీ కొడుతూ పాతాళానికి పడిపోతున్నాడని.. అతడికి ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.