YCP: ప్రస్తుతం ఏపీలో నెమ్మదిగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కేబినెట్ భేటీకి రంగం రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన భేటీని జూన్ 7వ తేదీన నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి జారీ చేశారు. రెండురోజుల కిందట సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తొలిరోజు నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంటు నూతన భవనం వేడుకలో పాల్గొన్నారు. మూడోరోజు సోమవారం షెడ్యూల్ను మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ పర్యటనలో పైకి చెప్పకుండా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో జగన్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలు ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత భేటీ అయి చర్చించారు. ఈ సమయంలో పోలవరం, కడప ఉక్కు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు వంటివాటిపై చర్చించామని ప్రభుత్వం తెలిపింది. కానీ, దీనికోసమే అయితే అర్ధరాత్రి వేళ జగన్ నేరుగా అమిత్ షాను కలుసుకుంటారా? అనేది ప్రశ్న. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకువెళ్లాలనే వ్యూహంతోనే జగన్ ఇలా వ్యవహరించి ఉంటారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయంలో బాబుకి షాక్ ఎదురవునుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే కేబినెట్ భేటీకి రంగం రెడీకావడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న వేడిలోనే ఎన్నికలకు వెళ్లిపోతే వైసీపీ మళ్లీ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు కూడా కొన్నాళ్లుగా చెబుతు న్నాయి. కాగా ప్రస్తుతం పొత్తుల విషయం కూడా తేలకపోవడంతో ప్రతిపక్షాలు కూడా వేటికవే పనిచేసుకుంటున్నాయి. ఈ సమయంలో హఠాత్తుగా ఎన్నికలకు వెళ్తే పొత్తుల విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వారిని మానసికంగా రెడీ చేసేందుకు ప్రతిపక్షాలకు చాలా సమయం పడుతుంది.