Rudraksha: చాలామంది రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. కొంతమంది రుద్రాక్ష మాల ధరిస్తే ఇంకొకరు కేవలం పంచముఖ రుద్రాక్ష అంటూ కేవలం ఒక రుద్రాక్షను మాత్రమే ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా రుద్రాక్ష మాలలను మునులు వేద పండితులు ధరిస్తూ ఉంటారు. రుద్రాక్షను రుద్రుడి కంటి నుంచి రాలి పడిన కన్నీటి చుక్కలు అని భావిస్తారు. రుద్రాక్ష వృక్షాల నుంచి వచ్చే కలపలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది చాలా అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇది శివుడికి చాలా ప్రీతి పాత్రమైనది. శివభక్తులు భక్తిగా ఇష్టంగా ఈ రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షలలో చాలా రకాల రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్షలను ధరించడం మంచిదే కానీ వాటిని ధరించినప్పుడు కొన్ని రకాల నియమాలను పాటించడం తప్పనిసరి.
మరి రుద్రాక్షలు ధరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రుద్రాక్షను ఎరుపు, పుసుపు లేదా తెలుపు దారంలో మాత్రమే ధరించాలి. వెండి, బంగారం, రాగితో చేసిన తీగలో కూడా ధరించవచ్చు. అలాగే రుద్రాక్ష ధరించే ప్రతి సారి ఓం నమ: శివాయ అని జపించాలి. రుద్రాక్ష ఎప్పుడైనా సరే స్వంత డబ్బుతో మాత్రమే కొనుక్కోవాలి. ఎవరైనా కొని ఇచ్చింది లేదా బహుమతి గా ఇచ్చింది ధరించకూడదు. మీరు కొనుకున్న రుద్రాక్షను ఎవరికీ ఇవ్వకూడదు. రుద్రాక్ష ధరించే ముందు ఒకసారి పండితుల సలహా తీసుకోవడం మంచిది. 27 పూసల కంటే తక్కువ రుద్రాక్షలు ఉన్న మాల ధరించకూడదు. అలా ధరించడం వల్ల శని దోషం ఏర్పడవచ్చు.
మాంసాహారం తినేవారు, మద్యం తాగేవారు, పొగతాగే అలవాటు ఉన్న వారు రుద్రాక్షలు ధరించకూడదు. అలా ధరిస్తే రుద్రాక్ష అపవిత్రమవుతుంది. ధరించిన వారు రకరకాల సమస్యల బారిన పడవచ్చు. స్మశానానికి వెళ్లే వారు ఇంట్లో రుద్రాక్ష జపమాల తీసివేసి వెళ్లాలి. ఒకవేళ మరచిపోతే స్మశానంలో ప్రవేశించేందకు ముందే తీసి జేబులో వేసుకోవడం మంచిది. అదేవిధంగా రాత్రి పడుకునే మందు కూడా రుద్రాక్ష తీసేసి పడుకోవాలి. రుద్రాక్ష తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. పీడ కలలు రావు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే తిరిగి రుద్రాక్షను ధరించవచ్చు. ఆ సమయంలో రుద్రాక్ష మంత్రం , రుద్రాక్ష మూల మంత్రాన్ని 9 సార్లు జపించాలి. పడుకునే ముందు రుద్రాక్షను తీసిన తర్వాత కూడా ఈ నియమాన్ని పాటించాలి. తీసేసిన రుద్రాక్షను పూజమందిరంలో పెట్టుకోవాలి. ఉదయం స్నానం తర్వాత రుద్రాక్ష ధరించేందకు సరైన సమయం. రుద్రాక్ష ధరించిన ప్రతి సారీ మంత్రాన్ని జపించాలి. రుద్రాక్ష పూజలో ఉంచి నేతిదీపం, దూపం సమర్పించాలి. స్నానానికి ముందు రుద్రాక్ష ధరించ కూడదు, తాకకూడదు.రుద్రాక్షను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే దుమ్ము, ధూళీ పూసలో చేరి ఉండిపోతాయి. వీలైనంత తరచుగా వీటిని శుభ్రం చేసుకోవాలి. దారం మురికిగా మారినా, పాడైపోయినా దారాన్ని మార్చాలి. రుద్రాక్ష శుభ్రం చేసిన తర్వాత పవిత్ర జలాలతో లేదా పాలతో కడగాలి. అలాగే స్త్రీలు నెలసరి సమయాల్లో రుద్రాక్ష ధరించకూడదు.అప్పుడే పుట్టిన పిల్లలను చూసేందుకు వెళ్లే వారు కూడా రుద్రాక్ష తీసేసి వెళ్లాలి.