IND vs PAK: మెల్బోర్న్ వేదికగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 158 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ (51 పరుగులు), షాన్ మసూద్ (52 పరుగులు) చేశారు. షాన్ మసూద్ మాత్రం చివరి ఓవర్ వరకు పోరాడుతూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చిన దారే తిరిగి వెళ్లారు. స్టార్ బ్యాటర్ షాహీన్ అఫ్రిది మాత్రం ఒక్క ఫోర్, సిక్సర్తో అలరించాడు. 8 బంతుల్లో 16 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో భారత్ పేసర్ భువనేశ్వర్ చేతిలో ఔట్ అయ్యాడు.
పాక్ బ్యాటింగ్ సమయంలో ఇండియా కట్టుదిట్టమైన ఫీల్డింగ్ చేసింది. భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాకిస్తాన్ బ్యాటర్లకు ముచ్చెమటలు చూపించారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ అర్షదీప్ సింగ్ మంచి ప్రతిభను కనబర్చారు. ఇద్దరూ కలిసి చెరో 3 వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అందరి నోట శెభాష్ అనిపించుకున్నాడు. అర్షదీప్ కూడా అద్భుతంగా రాణించాడు. తనపై దేశద్రోహి అని ముద్ర వేసిన విమర్శకులు, ట్రోలర్స్ కు తనదైన పనితనంతో జవాబిచ్చాడు. ఆసియాకప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అసీఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ను అర్షదీప్ ఈజీగా వదిలేశాడు. ఆ తర్వాత అర్షదీప్ బౌలింగ్లో అసీఫ్ అలీ ఒక ఫోర్, సిక్స్ బాది పాకిస్తాన్ మ్యాచ్ని గెలిపించాడు.
దీంతో అర్షదీప్ను దేశద్రోహిగా కామెంట్లు చేశారు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్లో అర్షదీప్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. 4 ఓవర్లో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్ను కూడా ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అర్షదీప్ను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.