Ashwini Dutt: నిర్మాత అశ్వనీదత్ వ్యవహార శైలిపై ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. సినిమా రంగంతోపాటు పాలిటిక్స్పైనా కామెంట్లు చేస్తుంటారు ఈ నిర్మాత. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు అశ్వనీదత్. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్కు గురయ్యారు. కొందరు ప్రముఖులు బాహాటంగానే ఈయన వ్యవహారంపై స్పందించారు.
ఇక సంక్రాంతి బరిలోని సినిమాలపై అశ్వనీదత్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. టాలీవుడ్లో పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మైత్రీ మూవీస్ టార్గెట్గా అశ్వనీదత్ కామెంట్ చేశారని చెబుతున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ సంక్రాంతి బరిలో రెండు సినిమాలను విడుదల చేయాలనుకోవడంమే అశ్వనీదత్ కామెంట్లకు కారణమైంది.
ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది సదరు సంస్థ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న రెండు మూవీలు అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతోపాటు తొలుత మెగాస్టార్ చిరంజీవికి మాటివ్వడం, అనంతరం బాలకృష్ణ కూడా సంక్రాంతి సందర్భంగా తన సినిమాను రిలీజ్ చేయాలనుకోవడంతో తప్పని పరిస్థితుల్లో మైత్రీ మూవీస్ను ఈ దిశగా నడిచేలా చేశాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ సంస్థ కొంతమేర నష్టపోతోందని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా చేయొచ్చుగా..
ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ.. మైత్రీ మూవీస్ సంస్థే అత్యుత్సాహంగా రెండు మూవీస్ రిలీజ్ చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. దిల్ రాజుకు మద్దతిస్తూ, మైత్రీ మూవీస్ సంస్థను విమర్శిస్తున్నారు అశ్వనీదత్. ఇలా చేసేబదులు.. నేరుగా తనకు దగ్గర మిత్రులైన చిరంజీవినో లేదా బాలకృష్ణనో అడిగి ఓ సినిమా వాయిదా వేయించే ధైర్యం లేదా.. అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలా చేయకుండా మైత్రీ మూవీస్నే టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.