Asia Airgun Championship: దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు పతకాల మోత మోగించారు. దీంతో ఈ టోర్నీని భారత్ 25 స్వర్ణ పతకాలతో ముగించింది. చివరి రోజు శుక్రవారం భారత్ ఖాతాలో మరో రెండు పసిడి పతకాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఫైనల్లో కజకిస్థాన్ జంట రఖీమ్ ఖాన్-ఇరినాపై 17-3 తేడాతో రిథమ్ సాంగ్వాన్-విజయ్ వీర్ సిద్దూ జంట స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో శివ నర్వాల్-యువిక తోమర్ కాంస్యం గెలుచుకున్నారు.
అటు 10 మీటర్ల జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ తుదిపోరులో మనుభాకర్-సామ్రాట్ రాణా జంట 17-3 తేడాతో ఉజ్బెకిస్తా్న్ జంట నిగీనా-కమలోవ్ జంటను ఓడించారు. ఇదే విభాగంలో కాంస్య పతకం పోరులో కొరియా జంట సెంగ్ జున్-యంగ్ జిన్పై భారత్ జంట ఇషాసింగ్-సాగర్ జంట 14-16 తేడాతో ఓటమి పాలయ్యారు.
ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్లో ఇటీవల జూనియర్ మహిళల విభాగంలో తెలంగాణ సంచలనం ఇషా సింగ్ రజత పతకం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ మహిళల విభాగంలో జరిగిన పసిడి పోరులో మనుభాకర్ చేతిలో 15-17 తేడాతో ఇషా సింగ్ ఓడిపోయింది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. కానీ చివర్లో మనుభాకర్ కీలక పాయింట్లతో ఇషా సింగ్పై ఆధిపత్యం సాధించింది.
టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్కు బంగారు పతకం
ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్ జూనియర్ మహిళల 10 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా సింగ్, మనుభాకర్, శిఖా నర్వాల్తో కూడిన భారత బృందం విజేతగా నిలవడంతో స్వర్ణ పతకం తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ పోరులో ఆతిథ్య కొరియాపై 16-12 తేడాతో భారత్ యువమహిళల త్రయం విజేతగా నిలిచింది. మొత్తంగా ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత్ ఖాతాలో 38 పతకాలు ఉన్నాయి. వీటిలో 25 స్వర్ణ పతకాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.