Balayya: అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. బాలయ్య కెరీర్లో ఇది 107వ సినిమాగా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచే ఈ మూవీపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. అఖండ తర్వాత తమ హీరో కెరీర్లో మరో హిట్ ఖాయమని ప్రచారం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
అఖండ తర్వాత వరుసగా బాలయ్య సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అఖండ విజయంలో తమన్ పాత్ర ఎంతో ఉంది. దీంతో వీరసింహారెడ్డి మూవీకి అతడు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేయనుంది. రాజసం నీ ఇంటి పేరు అంటూ సాగే పాటను ఈ నెల 25న ఉదయం 10:29 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతోంది. వీడియో రూపంలో లీక్ కావడంతో నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తమన్ మరోసారి కాపీ ట్యూన్ ఉపయోగించాడంటూ అభిమానులు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. లీకైన పాట వింటే అలాగే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పాట గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ మూవీ టైటిల్ సాంగ్లా ఉందని.. ఈ పాటలోని బీట్ను జై బాలయ్య అంటూ దింపేశాడని ఆరోపిస్తున్నారు.
తమన్ కాపీ కొట్టడం కొత్తేమీ కాదుగా
సాధారణంగా తమన్ సంగీతం బాగుంటుంది. అతడి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే అతడితో ఒకటే చిక్కు. తమన్ అందించే సంగీతంలో కొత్తదనం ఉండదనే రూమర్ ఉంది. అతడు తరచూ కాపీ ట్యూన్లు వాడతాడని.. గతంలో అలవైకుంఠపురంలో, భీమ్లానాయక్, గని వంటి సినిమాల విషయంలో తమన్ కాపీ ట్యూన్లు ఉపయోగించాడని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా తమన్ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు.