BCCI: భారత క్రికెట్ జట్టు వరుసగా ఐసీసీ టోర్నీల వైఫల్యంతో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసిన విషయం తెలిసిందే. మూడేండ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అండ్ కో. పై బీసీసీఐ ఆ పదవుల నుంచి తొలగించింది. మరికొంతకాలం వీరు పదవుల్లో కొనసాగాల్సి ఉన్నా టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యంతో బీసీసీఐ పెద్దలు వీరికి వీడ్కోలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త సెలక్షన్ కమిటీ ఎలా ఉండబోతుంది..? చీఫ్ సెలక్టర్ ఎవరు..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అయితే సెలక్షన్ కమిటీ చీఫ్ రేసులో ఇద్దరు మాజీ క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్. అగార్కర్ బౌలింగ్ ఆల్ రౌండర్ కాగా శివరామకృష్ణన్ స్సిన్నర్ గా భారత జట్టుకు సేవలందించారు.
ఈ ఇద్దరూ గతంలో సెలక్షన్ కమిటీలో చోటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారే. పలు కారణాల వల్ల అగార్కర్ కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కలేదు. ఇక శివరామకృష్ణన్.. 2020లో అర్జీ పెట్టుకున్నా బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది.
చీఫ్ సెలక్టర్ గా అగార్కర్ పేరు ఖాయమే అని వినిపిస్తున్నప్పటికీ శివరామకృష్ణన్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. అతడికి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ తో పాటు జై షా అండదండలూ ఉన్నాయని సమాచారం. దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరం కానున్నది.
సెలక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు :
– భారత జాతీయ జట్టు తరఫున కనీసం 7 టెస్టులు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవముండాలి.
– క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐదేండ్లు దాటి ఉండాలి.
– వయస్సు 60 ఏండ్ల లోపే ఉండాలి.
– ఏదైనా క్రికెట్ కమిటీ లో సభ్యుడిగా ఉంటే అనర్హుడు.