BCCI: టీ20 ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా దారుణ పరాజయం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. కొత్త కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకు ఈనెల 28 తుది గడువు(నేడు)గా పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. చివరినిమిషంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సౌత్ జోన్ నుంచి లక్ష్మన్ శివరామకృష్ణ బలమైన అభ్యర్థని ప్రచారం జరుగుతోంది.
పాత సెలక్షన్ కమిటీ తొలగింపునకు ఇవీ కారణాలు..
రోహిత్ సేన ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓటమి పాలవడంతో సెలెక్షన్ కమిటీకి ఉద్వాసన ఖాయమని అంచనా వేశారు. చేతన్ హయాంలోనే 2021 టీ20 వరల్డ్ కప్లో భారత్ నాకౌట్కు కూడా చేరని సంగతి తెలిసిందే. అలాగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షి్ప ఫైనల్లో కూడా భారత్ ఓటమిపాలైంది. దాంతో చేతన్ కమిటీపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. గట్టి జట్టును రూపొందించలేకపోవడం, ఏడాదిలో ఎనిమిది మంది అంతర్జాతీయ కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించడం, 8 నెలలు టీ20లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ను ప్రపంచ కప్నకు ఎంపిక చేయడం, దేశవాళీ, ఐపీఎల్లో సత్తా చాటిన యువ క్రికెటర్లకు చేతన్ శర్మ బృందం అవకాశాలు కల్పించకపోవడం, రెండు ప్రపంచ కప్లకూ ప్రత్యేక ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోవడంలాంటి అంశాలు ప్రస్తుత కమిటీపై వేటుకు కారణాలుగా తెలుస్తోంది.
మూడు ఫార్మాట్లకు వేర్వేరుగా..
కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే సెలెక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దాంతో రోహిత్ టెస్ట్లతోపాటు ప్రస్తుతానికి వన్డేలకూ సారథిగా వ్యవహరిస్తాడు. ఇక హార్దిక్ పాండ్యా 2024లో జరిగే పొట్టి ప్రపంచ కప్ వరకూ కెప్టెన్గా కొనసాగే అవకాశముంది.
సెలెక్షన్ కమిటీ విధులు – బాధ్యతలు
కాగా, సెలక్షన్ కమిటీ నిర్వర్తించాల్సిన బాధ్యతలను బీసీసీఐ స్పష్టంగా సూచించింది.
☛ న్యాయంగా, పారదర్శక పద్ధతిలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలి.
☛ సీనియర్ పురుషుల టీమ్ రిజ్వర్ బెంచ్ను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. దానికి తగ్గట్లు ప్రణాళికలు తయారు చేయాలి.
☛ అవసరమైన సందర్భంలో జట్టు సమావేశాలకు హాజరు కావాలి.
☛ దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్లను గమనించేందుకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి.
☛ ఆటగాళ్ల, జట్టు ప్రదర్శనపై ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు సమర్పించాలి.
☛ జట్టు ఎంపికపై, బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలి.