BCCI: కొంతకాలంగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు కట్టబెట్టారు. అయినా పరిస్థితిలో ఇంచు కూడా మార్పు రాలేదు. ఐసీసీ ట్రోఫీల్లో పరాజయాలు జట్టు ప్రతిష్ఠను దిగజార్చాయి. అందుకే ఈసారి కోచ్ మీద బీసీసీఐ దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త సంవత్సరం రోజున భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను బీసీసీఐ తీసుకుంది.
టీమిండియా జూనియర్ జట్టుకు కోచ్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ను బీసీసీఐ ఏరికోరి సీనియర్ జట్టుకు కోచ్గా ఎంపిక చేసింది. అయితే జట్టుకు విజయాలు అందించడంలో ద్రవిడ్ విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను కోచ్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది.
అయితే ఈ నిర్ణయం ఈ ఏడాది నవంబర్లో జరిగే వన్డే ప్రపంచకప్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ వన్డే ప్రపంచకప్లో ఆశించిన ఫలితాన్ని సాధిస్తే కోచ్గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును బీసీసీఐ పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే ద్రవిడ్ గైర్హాజరీలో భారత్-ఏతో పాటు సీనియర్ జట్టుకు లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అండర్-19 ప్రపంచకప్ను గెలుచుకోవడంలోనూ లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు.
టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు కోచ్లు ఉంటారా?
ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఒకే కోచ్ ఉన్నారు. అయితే వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, కోచ్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ రెగ్యులర్ కెప్టెన్గా ఉన్నాడు. అలాగే టెస్ట్లు, వన్డేలకు ద్రవిడ్ను కోచ్గా కొనసాగిస్తూ.. టీ20లకు ప్రత్యేకంగా మరొక కోచ్ను నియమిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.