BCCI: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు అన్ని దేశాలలో జరుగుతున్న లీగ్లలో ఆడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. విదేశీ లీగ్ల వల్ల తమకు లాభమేనని కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లు కూడా విదేశీ లీగ్లలో పాల్గొనాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విదేశీ లీగ్ల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడాలా వద్దా అన్న అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. దేశీయ క్రికెట్ ఉండగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లు ఆడాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆటలో నైపుణ్యం కోసం, కొత్త అవకాశాలను అందుకోవడానికి దేశీయ క్రికెట్ కావలసినన్ని అవకాశాలు ఇస్తోందని తెలిపాడు. దేశీయ క్రికెట్, ఐపీఎల్, ఇతర టోర్నీలతో టీమిండియాకు కావలసినంత అనుభవం వస్తుందన్నాడు.
టీమిండియా ఆటగాళ్లు కొత్తగా విదేశీ లీగ్లు ఆడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రవిశాస్త్రి అన్నాడు. ఇప్పటికే బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అలసిపోతున్నారని.. విదేశీ లీగ్లలో ఆడేందుకు మనవాళ్లకు అవకాశం ఇస్తే ఆటగాళ్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఉండవని పేర్కొన్నాడు. భవిష్యత్లో రెండు భారత జట్లు ఆడే అవకాశాలున్నాయని.. ఒక జట్టు ఒక దేశంలో పర్యటిస్తే.. మరో జట్టు వేరే దేశంలో ఆడే ఛాన్స్ ఉందన్నాడు.
విదేశీ లీగ్ల వల్ల దేశవాళీ క్రికెట్ నాశనం
బిగ్బాష్ లాంటి లీగ్లలో ఆడటం వల్ల ఇంగ్లండ్ క్రికెటర్లకు కలిసొచ్చిందని.. అందుకే ఆ జట్టు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిందని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కానీ రంజీ సీజన్ జరుగుతున్న సమయంలోనే బిగ్బాష్ లీగ్ జరుగుతోందని.. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు బిగ్బాష్ లీగ్లో ఆడే అవకాశమిస్తే దేశవాళీ క్రికెట్ నాశనం అవుతుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న భారతజట్టుకు రాహుల్ ద్రవిడ్ దూరంగా ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.