BCCI: ఇటీవల కాలంలో టీమిండియా వరుస పరాజయాలు చవి చూస్తున్న నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కీలకమైన సెమీస్ మ్యాచ్లో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో భారీ ఓటమిని చవిచూసింది. ఏకంగా వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ ఓపెనర్లు 169 పరుగులను ఛేజ్ చేశారు.
టీ20 వరల్డ్ కప్లో ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లండ్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. జోస్ బట్లర్ సేన ప్రస్తుతం జోరు మీదుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇక వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి తర్వాత న్యూజిలాండ్లో పర్యటించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్, వన్డే సిరీస్ ఆడిన భారత్.. టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. తర్వాత వన్డే సిరీస్లో కివీస్ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో టీమిండియాలో భారీ మార్పులు చేయాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బీసీసీఐ చీఫ్గా ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తప్పించి రోజర్ బిన్నీని బీసీసీఐ ప్రెసిడెంట్గా నియమించారు. ఆ మార్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది.
కొత్త కోచ్ వేటలో బీసీసీఐ..
ఈనెలలో భారత్.. బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ క్రమంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లతో కీలక భేటీకి బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మను కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ద్రవిడ్ పదవికి గండం పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కోచ్ను ఎంపిక చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.