Pakistan: ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్లో పర్యటిస్తోంది. తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా జరిగింది. అయితే ఈ టెస్టు కోసం వేసిన రావల్పిండి పిచ్పై ఐసీసీ అభ్యంతరాలు తెలిపింది. ఈ పిచ్ మరీ చెత్తగా ఉందంటూ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రావల్పిండిలోని పిచ్కు ఈ రేటింగ్ రావడం వరుసగా ఇది రెండోసారి. గతంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి చెత్త పిచ్ ఏర్పాటు చేసినట్లు ఐసీసీ నివేదిక ఇచ్చింది.
ఐసీసీ పిచ్ రేటింగ్ విధానాల ప్రకారం ఓ పిచ్కు ఐదు నెగిటివ్ పాయింట్స్ వస్తే సదరు మైదానంలో మరో ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఇప్పటికే రావల్పిండి పిచ్ ఖాతాలో రెండు మైనస్ పాయింట్లు చేరాయి. ఐదేళ్ల వ్యవధిలో మరో మూడు నెగిటివ్ పాయింట్లు వస్తే ఈ మైదానంపై బ్లాక్ మార్క్ పడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సమయంలో ఈ పిచ్పై భారీగా విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా సైతం పిచ్ నిర్వాహకులను విమర్శించాడు. పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఇది టెస్టు మ్యాచ్ ఆడాల్సిన పిచ్ కాదని పెదవి విరిచారు. ఈ పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించలేదని అంపైర్లు కూడా అభిప్రాయపడ్డారు.
సెంచరీల మీద సెంచరీలు
రావల్పిండి పిచ్ చెత్తగా ఉండటంతో ఇంగ్లండ్, పాకిస్థాన్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ జట్టులో అయితే ఒకే ఇన్నింగ్స్లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు కొట్టారు. అది కూడా చాలా వేగంగా సెంచరీలు పూర్తి చేయడం గమనించాల్సిన విషయం. అటు పాకిస్థాన్ జట్టులోనూ ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు పూర్తి చేశారు. అంతేకాకుండా టెస్టు మ్యాచుల చరిత్రలోనే తొలిసారిగా ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలి రోజే 500కు పైగా స్కోరు చేసి అందరికీ షాకిచ్చారు.