Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు వైసీపీ నేతలతో చేతులు కలిపి కుట్ర పన్ని కేసులు పెట్టారని టీడీపీ నేత, భూమా కుటుంబానికి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సుబ్బారెడ్డి చున్నీ లాగారని ఆమె తెలిపింది. దీనిపై ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. అప్పుడు తానేంటో చూపిస్తానని, తనను తీహార్ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తాను అంటూ ధీమా వ్యక్తం చేసింది అఖిల ప్రియ. అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. ఏవీ సుబ్బరెడ్డి పార్టీలో ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉన్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారని అని ఆమె చెప్పుకొచ్చింది. తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను ఆళ్ళగడ్డ ప్రజలకు అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
నంద్యాలలో మాట్లాడిన ఆమె పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది.