BJP-Congress: తెలంగాణలో రసవత్తరంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేసినా.. కాంగ్రస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. మునుగోడులో కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుని కాస్త బలపడుతుందని హస్తం పార్టీ శ్రేణులు భావించారు. కానీ కాంగ్రెస్ మొత్తానికి డీలా పడిపోయింది.
మునుగోడులో కాంగ్రెస్ ఓటమితో ఆ పార్టీలో ఉన్న మరికొంతమంది నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయ్యేందుకు సిద్దమవుతోన్నారు. ఈ క్రమంలో ఓ కీలక నేత కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్దమయ్యారు. తాజాగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పాటిల్ బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికకు ముందే ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత బాగుంటుందని భావించారు.
ఈ క్రమంలో త్వరలో కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. ఈ నెల 28న బీజేపీతో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా బైంసాలో తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించారు. స్థానిక హిందూ సంఘాల నేతలతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ మార్పుపై బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతోన్నారు. బీజేపీ నేతల నుంచి వచ్చిన ఆహ్వానంతో.. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు.
2018 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రామారావు పాటిల్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం లభించింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో ఆయన అసంతృప్తితో ఉన్నారు.