Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రాజ్భవన్కు మధ్య అసలు పడదనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్.. బెంగాల్ గవర్నర్గా ఉన్న సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవో అందరికి తెలిసిందే. అనేక సందర్భాల్ల, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉండేంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింసాకాండ వరకు, అవినీతి ఆరోపణల నుంచి అధికారులకు సంబంధించి వ్యవహారాల వరకు.. టీఎంసీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ధన్ఖర్ తరచుగా అనేక సమస్యలను లేవనెత్తారు. మరోవైపు టీఎంసీ వైపు నుంచి ఆయనకు కౌంటర్గా విమర్శలు చేసేవారు.
ఈ క్రమంలోనే గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇరుపక్షాల మధ్య బంధం మరింత తీవ్రరూపం దాల్చింది. మరోవైపు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింప చేసిన పలు బిల్లును కూడా గవర్నర్ పునఃపరిశీలన కోసం పంపేవారు. అయితే జగదీప్ దన్కర్ స్థానంలో బెంగాల్ గవర్నర్గా లా గణేశన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
ఇటీవల మమతా నివాసంలో జరిగిన కాళీ పూజ కార్యక్రమానికి లా గణేశన్ హాజరయ్యారు. మరోవైపు నవంబర్ 3న చెన్నైలో జరిగే తన అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాల్సిందిగా లా గణేశన్.. సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ నేడు (నవంబర్ 2) చెన్నై బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడ మమతా బెనర్జీ ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో పాటు, తమిళనాడుకు చెందిన మరికొందరు రాజకీయ నాయకులను కూడా ఆమె కలవనున్నారు. అయితే స్టాలిన్తో భేటీని మర్యాదపూర్వక సమావేశం అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నప్పుడు.. కొన్ని రాజకీయాలు ఎప్పుడూ చర్చించబడతాయని అన్నారు.
అయితే స్టాలిన్ భేటీ, ఇతర అంశాలు పక్కనబెడితే.. బెంగాల్ గవర్నర్ లా గణేశన్ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నైకి రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య ఏర్పడిన గ్యాప్ను తొలగించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పరిణామాలకు వెనక.. లా గణేశన్ కూడా బెంగాల్ ప్రభుత్వంతో సత్సబంధాలు కొనసాగించడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం లేనందున.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పట్లో తృణమూల్ను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం లేదు. దీంతో గతంతో పోలిస్తే.. ప్రస్తుతానికి బెంగాల్లో రాజకీయ వాతావరణం కొంతకాలం ప్రశాంతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా కూడా గవర్నర్ కార్యాలయంతో రచ్చ ఎందుకనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఆమె ఈ విధంగా రాజ్భవన్తో వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.