Rajasingh: పీడీ యాక్ట్ కేసులో కొద్ది నెలల పాటు జైల్లో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను ఆయనకు హైకోర్టు మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడవొద్దని కండీషన్ పెట్టింది. మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. మొన్నటివరకు చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు.
ఈ క్రమంలో పలువురు రాజాసింగ్ ను కలిసి పరామర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణలో కలకలం రేపిన క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్. రాజాసింగ్ ను కలిశారు. జైలు నుంచి బయటకు రావడంతో.. మర్యాదపూర్వకంగా రాజాసింగ్ ను కలిశారు. చికోటి ప్రవీణ్ తన అనుచరులతో కలిసి రాజాసింగ్ ఇంటికెళ్లి ఆయనను కలిశారు. అంతుకుముందు కోఠి ఇసామియా బజార్ లోని సంతోషిమాత ఆలయానికి ర్యాలీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
రాజాసింగ్ తో భేటీ అనంతరం చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, హిందూవాదిగానే రాజాసింగ్ ను కలిసినట్లు స్పష్టం చేశారు. హిందూత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. రాజాసింగ్ ను తాను ఎప్పుడూ ఎమ్మెల్యేగా చూడలేదని, హిందూత్వవాదిగానే ఆయనను చూసినట్లు చెప్పారు.
తను చేపట్టిన ర్యాలీని రాజకీయం చేయవద్దని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. 20 ఏళ్ల తర్వాత మైనార్టీలుగా చెప్పుకోవాల్సిన పరిస్థిత ఏర్పడుతుందని చికోటి ప్రవీణ్ చెప్పారు. హిందూత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ హిందూత్వాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని చికోటి ప్రవీణ్ పిలుపునిచ్చారు. రాజాసింగ్ హిందూత్వం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. హిందూత్వాన్ని కాపాడేందుకు ఆయన కృషి చేస్తున్నట్లు తెలిపారు.