Cricket: కొంతకాలంగా టీమిండియాకు సీనియర్ ఆటగాళ్లు బుమ్రా, రవీంద్ర జడేజా దూరంగా ఉంటున్నారు. గాయాల కారణంగా గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్కు వీళ్లిద్దరూ దూరమయ్యారు. అయితే ఇప్పటివరకు వీళ్లు కోలుకోకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. వీళ్ల స్థానాన్ని యువ ఆటగాళ్లు భర్తీ చేస్తున్నా ఎవరూ నిలకడగా ఆడటం లేదు. బుమ్రా లేకపోవడంతో టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నాటికి అతడు రీ ఎంట్రీ ఇస్తాడని భావించినా తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో బుమ్రాకు చోటు దక్కలేదు.
దీంతో బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్కు బుమ్రాను ఎంపిక చేసినా ఆఖరి నిమిషంలో మరోసారి వెన్నునొప్పితో బుమ్రా బాధపడుతున్నాడని తెలిసి బీసీసీఐ అతడిని జట్టు నుంచి తొలగించింది. అటు రవీంద్ర జడేజా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జడేజా గాయపడ్డాడని బీసీసీఐ చెప్తున్నా అతడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాలకు తావిచ్చింది.
అయితే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్లకు కూడా జడేజా దూరంగానే ఉన్నాడు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు కూడా జడేజా ఎంపిక కాలేదు. అటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు జడేజాను సెలక్టర్లు ఎంపిక చేసినా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఆడతాడని స్పష్టం చేశారు. దీంతో జడేజా రీ ఎంట్రీపై అనుమానాలు నెలకొన్నాయి.
రాణిస్తున్న అక్షర్ పటేల్.. జడేజాకు చోటు కష్టమేనా?
రవీంద్ర జడేజా గైర్హాజరీలో జట్టులో వరుసగా అవకాశాలు పొందుతున్న అక్షర్ పటేల్ ప్రతిసారీ తన సత్తా నిరూపించుకుంటూనే ఉన్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కూడా రాణించాడు. జడేజా చివరిగా 2018లో కేవలం 8 మ్యాచుల్లోనే 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ ఏడాదిలో జడ్డూ యావరేజ్ 24.57గా ఉంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడేళ్లలో అతని యావరేజీలు 38, 64.23, 53.92గా నమోదయ్యాయి. ఇలాంటి యావరేజీతో జడేజా అంతర్జాతీయ రీఎంట్రీ చేయడం కష్టమే అని భావించాలి.