Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు ఈ మహానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్ తన ఇమేజ్ కలగలిపి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే ఇంత ఇంపార్టెంటు అని చెబుతున్న మహానాడు కార్యక్రమానికి నలుగురు కీలక నాయకులు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ హాజరు కాలేదు.
కేవలం వీరు మాత్రమే కాకుండా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, గుంటూరుకు చెందిన రాయపాటి సాంబశివరావు, ఆయన తనయుడు రంగారావు వంటివారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటుగా 2017లో వైసీపీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కిన 23 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది వరకు ఇప్పుడు మహానాడుకు డుమ్మా కొట్టారు..సొంత జిల్లాకు చెందిన వంతల రాజేశ్వరి వంటి వారు కూడా ఈ మహానాడు కి రాలేదు.
ఇక, జగన్పై నిప్పులు చెరిగిన గిడ్డి ఈశ్వరి కూడా కనిపించలేదు. అదేసమయంలో విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ మాత్రం కొంత హడావుడి చేశారు. అయితే ఇక్కడ కూడా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వర్గం ఒక రకంగా జలీల్ ఖాన్ మరోరకంగా వ్యవహరించారు. దీంతో మహానాడులో ఈ కీలక నేతల మిస్సింగులపై పార్టీలోను, రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
వారు కావాలనే ఉద్దేశ పూర్వకంగానే డుమ్మా కొట్టారా? లేక ఏదైనా బలమైన కారణం ఉందా? అనేది తేలియాల్సి ఉంది.