Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం, ఆయన హత్యకు కుట్ర జరిగిందనే విషయం బయపటడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లోని నీరూస్ వెనుక ఉన్న పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఆయన హత్యకు రెక్కీ నిర్వహించారనే విషయం పెను సంచలనంగా మారింది. గత కొద్దిరోజులుగా పవన్ ను ఫాలో అవుతున్నారని, ఆయన ఇంటి వద్ద కాపు కాస్తున్నట్లు వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి. పవన్ కల్యాణ్ నిరంతరం ఫాలో అవుతున్నారని, హత్య చేసేందుకు మంచి స్పాట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం పెను ప్రకంపనలు రేపుతోంది.
పవన్ హత్యకు కుట్రకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు నుంచే పవన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తేల్చాయి. దాదాపు రూ.250 కోట్ల వరకు పవన్ ను హత్య చేసేందుకు కొంతమందికి సుపారీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 19వ తేదీన కడప జిల్లా సిద్ధవరంలో పవన్ హత్యకు తొలిసారి కుట్ర జరిగిందని చెబుతున్నారు. సిద్దవరంలో కౌలు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ వెళ్లారు. అప్పుడు పవన్ కల్యాణ్ కాన్వాయ్ లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించే ప్రయత్నం చేసిందని అంటున్నారు.
పవన్ భద్రత సిబ్బంది గుర్తించి వెంటనే ఆ వాహహాన్ని, అందులోని వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చి పంపించినట్లు చెబుతున్నారు. అప్పుడు పవన్ హత్యకు స్పాట్ పెట్టారని, కానీ పవన్ సిబ్బంది గుర్తించడంలో వారి హత్య ప్రయత్నాలు భగ్నం అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పుడు గత కొద్దికాలంగా పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారనే వార్తలు రావడం, పవన్ ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో పలువురు వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలియడంతో… పవన్ హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు భద్రత కల్పించాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ, హత్యకు కుట్ర చేసిన ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో అయిన కడపలోనే పవన్ హత్యకు తొలిసారి కుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించడంపై జనసైనికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. దీని వెనుక ఎవరు కుట్ర దాగి ఉందనేది విచారణ చేసి బయటపెట్టాలని కోరుతున్నారు.
పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారనే వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ చర్యను చంద్రబాబు ఖండించారు. జనాలను చంపేస్తారా.. బ్రతకనివ్వరా అంటూ ఘాటుగా స్పందించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో విచారణ చేసి బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాదాపు వారం రోజులుగా పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని, ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగానే ఏవోవే సమాధానాలు చెబుతున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం మీడియాకు తెలిసిందని అంటున్నారు. దీంతో గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు సంచలనంగా మారాయి.