Pratyusha: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ ప్రత్యూష ఘటన మరువలేనిది. 20 ఏళ్ల క్రితం ఆమె ఓ వెలుగు వెలిగింది. అందం, అభినయం, సంప్రదాయ వస్త్రాధరణతో ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. కొంటెగా కవ్వించే పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు అమ్మాయి అయిన ప్రత్యూష రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్బాబు హీరోగా వచ్చిన రాయుడు సినిమాలో మోహన్బాబు కూతురు పాత్రలో కనిపించింది. ఆ తర్వాత స్టార్స్ సినిమాల్లో నటించి మెప్పించింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ తో కలిసి కలుసుకోవాలని అనే సినిమాలో గజాలా తర్వాత మరో హీరోయిన్ గా హీరోకు మరదలి పాత్రలో కనిపించింది.
అక్కినేని హీరోలు అయిన నాగార్జున, సుమంత్ తో కలిసి స్నేహమంటే ఇదేరా సినిమాలో కనిపించింది. ఇందులో ప్రత్యూష సుమంత్కు జోడీగా నటించింది. ప్రత్యూషతో కలిసి నటించేందుకు అప్పట్లో తెలుగుతో పాటు తమిళ కుర్ర హీరోలు కూడా పోటీ పడేవారు. ముఖ్యంగా సన్నగా, నాజూగ్గా ఉండే ఆమె అందచందాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకునేవి. అయితే మంచి మంచి ఛాన్సులు వస్తోన్న క్రమంలో ప్రత్యూష 2002 ఫిబ్రవరిలో అనుమానాస్పదంగా చనిపోయింది.
ప్రత్యూషది అనుమానస్పద మృతి అయినా కూడా ఆమె స్నేహితుడు, ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సిద్ధార్థ్ రెడ్డి, అతడి స్నేహితులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఆమెపై హత్యాచారం చేసి చంపేశారని అందరూ కోడై కూశారు. ప్రత్యూష తల్లి కూడా ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటారు. అప్పట్లో ప్రత్యూషను జాయిన్ చేసిన హాస్పిటల్లో పక్కనే ఉన్న వారు ప్రత్యూషకు స్పృహ లేదని తనకు చెప్పినట్లు సరోజనీ దేవి తెలిపింది.
కొందరు వ్యక్తులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ప్రత్యూషను ఐదారు గెస్టు హౌస్లకు మార్చి మార్చి నలుగురైదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, అయితే వాళ్ల పేర్లు మాత్రం తాను చెప్పనని ఆమె వెల్లడించింది. తన కూతురు ప్రత్యూష ఇప్పుడు బతికుంటే పెళ్లి అయ్యి పిల్లలతో ఫ్యామిలీ జీవితం ఆనందంగా గడిపేదని, తమకు ఆ అదృష్టం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.