MLC Election: వేపాడ చిరంజీవిరావు అంటే చాలామంది గుర్తు పట్టక పోవచ్చు కానీ ఎకానమీ చిరంజీవి అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. టీడీపీ మద్దతుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి అభ్యర్థిగా పోటీచేసి తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్లి సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి అయిన సీతంరాజు సుధాకర్కు గట్టి షాక్ ఇచ్చారు. అంచనాలను మించి తొలి ప్రాధాన్య ఓటులో భారీగా ఓట్లు సాధించినప్పటికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లతో ఘన విజయం సాధించారు చిరంజీవి.
శాసనమండలిలో తొలిసారి కాలు మోపేందుకు సిద్ధమవుతున్న ఎకానమీ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర విషయాల మనం తెలుసుకుందాం.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో 1972లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన చిరంజీవి కొత్తకోటలో ఇంటర్ చదివారు. డిగ్రీ, బీఈడీ తర్వాత ఏయూ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహెచ్డీ చేశారు. 1995లో ఏయూసెట్లో ప్రథమ ర్యాంక్ సాధించారు. 1996 డీఎస్సీలో ఎంపికై ఎస్జీటీగా కొలువు ప్రారంభించిన ఆయన ఆ తర్వాత స్కూలు అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన భార్య నివేదిత విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా 12 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆరు పుస్తకాలు రాశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు. చదువు విషయంలో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా చిరంజీవి రావు ముందుంటున్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థికసాయం చేయడం, వెబ్సైట్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు ఎకనామిక్స్ బోధన మెటీరియల్ను అందుబాటులో ఉంచడంతో పాటు, లక్ష్యసాధనకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. కొవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు కూడా పంపిణీ చేశారు. రోగులకు ఆర్థికసాయం చేశారు.