FAKE: రోజురోజుకీ సమాజంలో ఫేక్ బాబాలు ఫేక్ డాక్టర్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇక ప్రధాన నగరాలలో ఏవో నాలుగైదు రకాల టాబ్లెట్స్ పెట్టుకొని చిన్న క్లినిక్ అంటూ వారికి తోచిన మందులను ఇంజక్షన్ ఇస్తూ ప్రజల ప్రాణం మీదికి తెస్తున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ పాతబస్తీలో ఫేక్ ఎంబీబీఎస్ డాక్టర్లు గల్లీకి ఒక్కరు పుట్టుకొస్తున్నారు. అయితే కష్టపడి చదివి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన స్థానంలో నకిలీ వైద్యులు వారికి తోచిన మందులను ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతే కాకుండా ఎటువంటి విద్యార్హతలు లేకుండానే క్లినిక్ లు పెట్టి వాటిపై ఎంబీబీఎస్ అనే బోర్డులను తగిలించి వారికి ఇష్టం వచ్చిన విధంగా పేషంట్లకు వైద్యం చేసి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
తాజాగా హైదరాబాదులోని పాతబస్తీలో ఇద్దరు నకిలీ డాక్టర్లను భవానీనగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారు నడుపుతున్న రెండు క్లినిక్లను పోలీసులు సీజ్ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. యాకుత్పురా మదీననగర్కు చెందిన మొహమ్మద్ సైఫుద్దీన్ 10వ తరగతి వరకు చదివాడు. రెండు సంవత్సరాలుగా తలాబ్ కట్టలో తలాహ నర్సింగ్ హోమ్ను నడుపుతున్నాడు. అలాగే భవానీనగర్ తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి మొహమ్మద్ మోజం ఇంటర్ వరకు చదివాడు. ఆరునెలలుగా సిద్దిక్ నగర్లో కేజీఎన్ పేరిట క్లినిక్ను నడుపుతున్నాడు.
ఇలా 10వ తరగతి, ఇంటర్తో వైద్యులుగా చెలామణి అవుతున్నారు ఈ నకిలీ డాక్టర్లు. వారి దగ్గరకు వచ్చే రోగులకు నోటికొచ్చిన మందులు రాసి ఇంజెక్షన్లు చేస్తూ వస్తున్నారు. అయితే వీరిపై అనేక కంప్లైంట్స్ రావడంతో భవానీనగర్ ఇన్స్పెక్టర్ అంజద్ ఆలీ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. వైద్యులుగా చెలామణి అవుతున్న సైఫుద్దీన్, మోజంలు నకిలీలనే విషయం పోలసుల విచారణలో తేలింది. దీంతో రెండు క్లినిక్ లను సీజ్ చేశారు. విద్యార్హత లేకుండా వైద్యులుగా చెలామణి అవుతున్న సైఫుద్దీన్ మోజంలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.