FIFA: ఫుట్బాల్ క్రీడాభిమానులకు కావాల్సినంత వినోదం పంచేందుకు గాను ఆదివారం (నవంబర్ 20న) ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటల (ఖతర్ స్థానిక టైం)కు 30 నిమిషాల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. సుమారు 60వేల మంది ప్రేక్షకుల నడుమ స్టేడియం దద్ధరిల్లింది. అనంతరం తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతర్ – ఈక్వెడార్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఈక్వెడార్.. 2-0 తేడాతో ఖతర్ ను ఓడించింది.
తొలి మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా ఖతర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 1930లో ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓడటం ఇదే ప్రథమం. 92 ఏండ్లలో 21 సార్లు ప్రపంచకప్ లు జరిగాయి. ఏ ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఓడలేదు. కానీ ఖతర్ మాత్రం దారుణంగా ఓడింది.
ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం ఖతర్ ప్రభుత్వం కోటానుకోట్లు ఖర్చు చేస్తున్నది. అదీపోను టోర్నీ నిర్వహణకు గాను ఖతర్ అనుసరిస్తున్న విధానాలు, స్డేడియాల నిర్మాణాలలో అవినీతి ఆరోపణలు, మద్యనిషేధం, సెక్స్ బ్యాన్, కఠిన నిబంధనలతో ఫిఫా ప్రపంచకప్ రోజూ వార్తల్లోనే ఉంటున్నది. ఇన్ని చేస్తున్నా విమర్శకులకు తమ ఆటతో అయినా సమాధానం ఇవ్వాలని భావించిన ఖతర్ కు ఈక్వెడార్ భారీ షాకిచ్చింది.
గతంలో ఖతర్ ఫిఫా ప్రపంచకప్ కు అర్హత సాధించలేదు. కానీ ఆతిథ్య దేశం హోదాలో ఈసారి దానికి ఆ అవకాశం దక్కింది. అయితే ఆ అవకాశాన్ని ఖతర్ సద్వినియోగం చేసుకోలేదు. దాదాపు రెండేండ్లుగా సన్నాహకాలు చేస్తున్నా ఖతర్ మాత్రం కనీసం పోటీకూడా ఇవ్వలేదు. ఈక్వెడార్ సారథి ఇనెర్ వాలెన్సియా.. 16వ, 31వ నిమిషంలో గోల్స్ చేసి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఈక్వెడార్ కు మూడు పాయింట్లు దక్కాయి.
⏱ Ecuador take the points in our first game at #Qatar2022! @adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 20, 2022