Gambhir: ఇటీవల ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓడిపోయింది. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక టీ20 లీగ్తో ఎందరో ప్రతిభావంతులు ఉన్నా టీమిండియా ఐసీసీ టోర్నీలు గెలవడం లేదు. ముఖ్యంగా బుమ్రా, జడేజా వంటి ఆటగాళ్ల సేవలు కోల్పోవడం టీమిండియా ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో భారత ఆటగాళ్లకు ఆట కంటే డబ్బు ముఖ్యం అయిపోయిందని.. ఐపీఎల్లో ఆడతారు కానీ ఐసీసీ టోర్నీల్లో మొహం చాటేస్తారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఈ విమర్శలను టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఖండించాడు. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడిపోవడానికి ఐపీఎల్ లాంటి టీ20 లీగ్ను నిందించడం సరికాదని కౌంటర్ ఇచ్చాడు. జట్టు ఓడిపోతే ఆటగాళ్ల ప్రదర్శనను నిందించాలి కానీ ప్రతిసారి లీగ్ను తప్పుబట్టడం మానుకోవాలని హితవు పలికాడు. ఐపీఎల్ ఎంతో మంది ఆటగాళ్లను వెలుగులోకి తెస్తుందని.. ఆటగాళ్ల వైఫల్యానికి ఐపీఎల్ మాత్రం కారణం కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
అటు భారత జట్టుకు భారతీయుడే కోచ్గా ఉండాలని గంభీర్ అన్నాడు. క్రికెట్ భావోద్వేగాలతో కూడుకున్నది అని.. కానీ మనవాళ్లు విదేశీ కోచ్లకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నాడు. విదేశీ కోచ్లు కేవలం డబ్బు సంపాదనకే ఇక్కడికి వస్తారని.. ఆటగాళ్ల భావోద్వేగాలతో వాళ్లకు పనిలేదని ఆరోపించాడు. ఐపీఎల్లోనూ భారత కోచ్లను చూడాలనేదే తన అభిమతమన్నాడు. బిగ్బాష్ లాంటి విదేశీ లీగ్లలో భారత కోచ్లకు అవకాశాలు రావడం లేదని.. బీసీసీఐ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరాడు.
ఇతర క్రీడలకు బీసీసీఐ తన ఆదాయం పంచాలి
ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు బీసీసీఐ అని.. ఈ కారణంగా మనదేశంలోని ఇతర క్రీడలకు బీసీసీఐ తన ఆదాయాన్ని పంచితే భారత్కు ఒలింపిక్స్ లాంటి టోర్నీల్లో పతకాల పంట పండుతుందని గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఆర్జిస్తున్న ఆదాయంలో క్రికెటర్ల జీతాలు, ఇతర ఖర్చులకు యాభై శాతం సరిపోతుందన్నాడు. మిగతా 50 శాతంలోని కొంత మొత్తాన్ని ఇతర క్రీడలకు పంచితే బాగుంటుందన్నాడు. అటు రానున్న రోజుల్లో దేశాభివృద్దికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని గంభీర్ చెప్పాడు.