Gangula Kamalakar: టీఆర్ఎస్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో పరిస్థితులపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై అక్కడి మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్పై టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్స్ ఇస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి మాటల యుద్దం చర్చనీయాంశంగా మారింది. గతంలో కేటీఆర్ ఏపీ గురించి కామెంట్స్ చేసిన సమయంలో, గోదావరి వరదల సమయంలో కూడా ఇలాంటి మాటల యుద్దం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం మాటల యుద్దం.. కొద్దిగా తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి.
ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందని.. కానీ తెలంగాణలో ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పారు. సీఎం జగన్ మాదిరిగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. మరింతగా అప్పులు వచ్చవేని.. ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చెపట్టేవాళ్లమని కూడా అన్నారు. ఈ కామెంట్స్పై పలువురు ఏపీ మంత్రలు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో బలహీనం అయిపోతున్నారా? అంటూ హరీష్ రావును ప్రశ్నించారు. అంతేకాకుండా.. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు హరీష్ రావు సిద్ధమా? అంటూ సవాలు విసిరారు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం హీట్ను పెంచాయనే చెప్పాలి. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమపై కామెంట్ చేయడం ఏమిటని.. హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో తెలియదని అన్నారు. హరీష్ రావుకు కేసీఆర్ తో ఏమైనా సమస్యలు ఉంటే.. వారు చూసుకోవాలని కామెంట్ చేశారు. తమని తిట్టి తమతో కేసీఆర్ను తిట్టించాలని హరీష్ రావు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎల్లో గ్యాంగ్ పలుకులే ఈ మధ్య కాలంలో హరీష్ రావు చెబుతున్నారని అన్నారు. అయితే సజ్జల రామ కేసీఆర్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనే అర్థం వచ్చేలా ఉన్నాయి.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సీరియస్గానే స్పందించారు. కేసీఆర్, హరీశ్రావు మధ్య సజ్జల చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఒక పార్టీ కాదని, అది ఒక కుటుంబమని అన్నారు. వైఎస్ కుటుంబంలో ఉడుములా చొచ్చిన సజ్జల.. తల్లీకొడుకును, అన్నాచెల్లిని విడగొట్టాడని ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై పడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఆ ఫ్రస్టేషన్లో సజ్జల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ నుంచి తెలంగాణకు పెరుగుతున్న వలసలే జగన్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమని కౌంటర్ ఇచ్చారు.
అయితే గంగుల ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వైసీపీ నేతల నుంచి ఆ రేంజ్లో రిప్లై రాలేదనే చెప్పాలి. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ల మంచి సన్నిహిత్యమే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తెగేదాకా లాగితే తాము ఇబ్బందుల్లో పడతామని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ మంత్రులతో సహా పలువురు వైసీపీ నేతలు నిత్యం హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక్కడే చాలా మందికి వ్యాపారాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్తో డైలాగ్ వార్ అంత మంచిది కాదని.. అన్ని రకాలుగా తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణతో గొడవ ఎందుకని.. ఇలా చేస్తే రానున్న కాలంలో పరిస్థితులు ఎదురుతిరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే వారు మరి అంతగా కౌంటర్ ఇవ్వలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్, వైసీపీ నాయకుల మధ్య డైలాగ్ వార్.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీకి సానుభూతి పొందేందుకు కూడా ఉపయోగపడతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతు్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు విజయం అయ్యాయని వారు గుర్తుచేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు అంతా సన్నిహిత్యం ఉన్నప్పుడు.. నాయకులు మాత్రం ఎందుకు మాటల దాడికి దిగుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.