Arshdeep Singh: శ్రీలంకతో రెండో టీ20లో భారత్ ఓటమికి ప్రధాన కారణం నోబాల్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ వేసింది రెండు ఓవర్లే అయినా మొత్తం 5 నోబాల్స్ వేశాడు. అతడు బౌలింగ్ చేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేసి శ్రీలంకకు భారీ స్కోరు కట్టబెట్టాడు. ఈ నేపథ్యంలో టీ20లలో వేసిన తొలి ఓవర్లోనే అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్గా అర్ష్దీప్ సింగ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
గత ఏడాది టీ20 ప్రపంచకప్లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లోనూ అర్ష్దీప్ సింగ్ వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే మెరుగుపరచుకున్నాడు. టీమిండియా బౌలర్లు మొత్తం ఏడు నోబాల్స్ వేయగా ఇందులో ఐదు నోబాల్స్ ఒక్క అర్ష్దీప్ సింగ్ మాత్రమే వేయడంతో అతడు ఎంత చెత్తగా బౌలింగ్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. భారత బౌలర్లు వేసిన నోబాల్స్ ద్వారా అదనంగా 36 పరుగులను ప్రత్యర్థికి సమర్పించుకున్నారు. ఈ అనవసర పరుగులే టీమిండియా ఓటమిని శాసించాయి.
అటు అర్ష్దీప్ సింగ్ వరుసగా నోబాల్స్ వేయడంపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల కాలంలో ఆటగాళ్లు తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్తున్నారని.. కానీ నోబాల్ వేయడం, వేయకపోవడం మాత్రం ఆటగాడి నియంత్రణలోనే ఉంటుందని గవాస్కర్ చురకలు అంటించాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లు నోబాల్స్ వేయకూడదని హితవు పలికాడు.
నోబాల్ వేయడం క్రైమ్ అన్న పాండ్యా
టీ20ల్లో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి ఇండియన్ బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్న అర్ష్దీప్.. తాను వేసిన తొలి ఓవర్లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో ఏ ఇతర భారత బౌలర్ వరుసగా మూడు నోబాల్స్ వేయలేదు. దీంతో అర్ష్దీప్ ప్రదర్శనపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. నోబాల్ వేయడం ఓ క్రైమ్ అని.. ఇది క్షమించరాని నేరమంటూ పాండ్యా అభిప్రాయపడ్డాడు.