Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్కు బీసీసీఐ అండగా నిలుస్తోంది. ఇప్పటికే తగిన వైద్య సదుపాయాలు అందిస్తున్న బోర్డు.. ఆర్థికంగానూ తగినంత సహాయం చేస్తోంది. రోడ్డుప్రమాదం కారణంగా పంత్ దాదాపు 6 నుంచి 9 నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. వన్డే ప్రపంచకప్ వరకు పంత్ మైదానంలోకి దిగే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆడకపోయినా పంత్కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం రిషబ్ పంత్ గ్రేడ్-ఎలో ఉన్నాడు. ఈ మేరకు అతడికి ఏడాదికి రూ.5 కోట్లను బీసీసీఐ చెల్లించాల్సి ఉంది. అయితే రిషబ్ పంత్ మ్యాచ్లను ఆడకపోయినా ఈ మొత్తాన్ని అతడికి అందిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఐపీఎల్ కూడా ఆడనప్పటికీ పంత్కు కాంట్రాక్ట్ ప్రకారం శాలరీని చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న బీమా సంస్థ చెల్లించేలా సదరు ఫ్రాంచైజీని ఆదేశించింది.
సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం టీమిండియా ఆటగాళ్లందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ నిబంధనల ప్రకారం గాయాల కారణంగా ఐపీఎల్కు దూరమైతే ఈ ఆటగాళ్లకు బోర్డు పూర్తి డబ్బును చెల్లిస్తుంది. రిషబ్ పంత్ గాయపడి ఐపీఎల్లో ఆడనందున అతడి ఐపీఎల్ జీతాన్ని పూర్తిగా చెల్లించే బాధ్యతను బీసీసీఐ తీసుకుంటోంది.
పంత్ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
మరోవైపు రిషబ్ పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని.. ప్రస్తుతం అతడు వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. తర్వాత అతనికి చేయాల్సిన చికిత్స, రీహాబిలేషన్ ప్లాన్ను డాక్టర్ దిన్షా పర్దీవాలా సూచిస్తారని వివరించింది. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీం నిత్యం పంత్ను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ పేర్కొంది. కాగా ప్రస్తుతం పంత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.