Health Tips: భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పటిక బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం పటిక బెల్లంలో చాలా ఔషధ గుణాలు ఉండటంతో వివిధ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఎంతటి దగ్గు ఉన్నా కేడా పటికబెల్లం పొడి, అల్లం రసంలను కలిపి తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. అంతేకాక కఫం కూడా మొత్తం పోతుంది. ముక్కు దిబ్బడ, శ్వాసకోశ సమస్యలు సైతం దూరమవుతాయి.
పటికబెల్లంకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అందుకుగాను ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక రెక్క కుంకుమ పువ్వు, కొద్దిగా పటికబెల్లం పొడి కలిపి రోజూ రాత్రి తాగాలి. దీంతో శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. గొంతు నొప్పి ఉంటే నోట్లో వేసుకుని చప్తరిస్తే ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. యాలకులు రెండు భాగాలు, పటిక బెల్లం ఒక భాగం తీసుకుని పొడి చేసిన మిశ్రమాన్ని రోజుకు 3-4 సార్లు తీసుకుంటే ఎంతటి దగ్గు ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది.
పటికబెల్లం పొడి, మిరియాల పొడి, కొద్దిగా నెయ్యిలను కలిపి మిశ్రమంగా చేసి తీసుకుంటే సైనస్ నుంచి ఉపశమనంతో పాటు తలనొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. కానీ.. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట మాత్రమే తీసుకోవాలి. అరచేతులు, పాదాల్లో మంటలుగా ఉన్నవారు కొద్దిగా పటికబెల్లం పొడిలో వెన్న కలిపి రాస్తే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. నోటి దుర్వాసన సమస్య ఉన్న వాళ్లు కూడా పసుపు, పటికబెల్లం పొడి, మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ఒక కప్పు గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకుంటే నోటి నుంచి వాసన రాదు. శరీరంలో అధిక వేడి ఉంటే చల్లని నీటి కొద్దిగా పటికబెల్లం పొడి కలిపి తాగడం వల్ల శరీరానికి చలువ కలుగుతుంది.