Varasudu: టాలీవుడ్ సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజును కొందరు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థియేటర్లను తన గుప్పిట్లో ఉంచుకొని సినిమా రిలీజ్ డేట్లను శాసిస్తూ ఉన్నాడని దిల్ రాజుపై అపవాదం ఉంది. ఆఖరికి స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎన్ని థియేటర్లు కేటాయించాలనే విషయంలో కూడా దిల్ రాజు హస్తం ఉంటోందని కొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు అయిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు ఉన్నా కూడా దిల్ రాజు కోలీవుడ్ హీరో విజయ్తో తీసిన వారసుడు సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయించారనే టాక్ నడుస్తోంది. దిల్ రాజు మాటలు కూడా అలాగే ఉండడంతో అసలు వీరయ్య, వీరసింహాకు అనుకున్న రేంజ్లో థియేటర్లు దొరుకుతాయా అని అందరికీ డౌట్స్ వచ్చాయి.
అయితే చివర్లో ట్విస్ట్ ఏంటంటే దిల్ రాజు అనూహ్యంగా వారసుడు తెలుగు వెర్షన్ను 14వ తేదికి మార్చారు. తమిళ్లో మాత్రం ముందుగా అనుకున్నట్టు 11వ తేదినే ఈ సినిమా విడుదలైంది. చిరు, బాలయ్య సినిమాలకు ఇబ్బంది కలగకూడదనే తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఏదేమైనా తన సినిమా కంటెంట్ మాట్లాడుతుందని రాజు ధీమా వ్యక్తం చేయగా కట్ చేస్తే తమిళ వెర్షన్ వరీసుకు అనుకున్నంత టాక్ రాలేకపోయింది.
చాాలా మంది ఈ సినిమాను ప్లాప్ అంటున్నారు. మామూలుగా విజయ్ సినిమాలకు తమిళనాడులో ప్లాప్ అయినా కూడా రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టేవి. అసలు బీస్ట్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆ సినిమాకే ఫస్ట్ డే ఏకంగా రూ.87 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. అదే వరీసుకు కేవలం రూ.46 కోట్లే రావడం గమనార్హం. కేవలం రూ.23 కోట్ల షేర్ రావడంతో వరీసు తమిళ ప్రేక్షకులకే నచ్చలేదని సమాచారం.
పైగా అదే రోజు మరో స్టార్ హీరో అజిత్ తునివు సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు దక్కాయని చెప్పొచ్చు. అజిత్ సినిమా కూడా విజయ్ సినిమా వసూళ్లపై పెద్ద దెబ్బ వేసిందని చెప్పాలి. పైగా తమిళ్లో విజయ్ సినిమాకు ప్లాప్ టాక్ రాగా ఇప్పుడు హిందీ, తెలుగులో లేట్గా రిలీజ్ కావడంతో ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అసలే వారసుడు ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా మన తెలుగు సినిమాలను కలిపి మిక్స్ చేసి తీసినట్టుగా ఉందని అంటున్నారు. ఇలాంటి టైంలో వారసుడు తెలుగులో మరింత డిజాస్టర్ అవుతుందనే చర్చలు కూడా మొదలయ్యాయి.
వారసుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్గా రూ.139 కోట్ల షేర్ రాబట్టాలి. అది ఏ మాత్రం సాధ్యం కాదని తెలుస్తోంది. వారసుడు తెలుగు కూడా రిలీజ్ అయిపోతే మరో లైగర్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. లైగర్ దెబ్బతో పూరి జగన్నాథ్ ఎలా ట్రోల్ అయ్యాడో ఇప్పుడు అసలే కోపం మీద ఉన్న టాలీవుడ్ జనాలు, తెలుగు సినీ అభిమానులు దిల్ రాజును కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తారని అంటున్నారు. అయితే మరి రాజు జాతకం ఎలా ఉందో శనివారం రోజు తేలనుంది.