Green Worm: ప్రస్తుత కాలంలో సోషల్మీడియా విపరీతంగా దూసుకుపోతోంది. సమాజంలో మంచి జరిగినా.. చెడు జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అంటూ వెంటనే జనాల్లోకి స్ప్రెడ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే దాన్ని జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. తాజాగా ఓ తెగ వైరల్ అవుతోంది. ఆకుపచ్చని పత్తి పురుగు ఒంటరిగా ఉంటుందని.. అది కుడితే ఐదు నిమిషాల్లోనే మనిషి చనిపోతాడని, కర్ణాటకలో ముగ్గురి ప్రాణాలు తీసిందని, పాము కంటే విషపూరితం అంటూ ఇద్దరు వ్యక్తులు పత్తి పొలంలో చనిపోయిన ఫొటో పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు.
అంతేకాక పత్తి పొలాల్లో ఈ పురుగు కన్పిస్తుందని చెబుతుండటంతో రైతులు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. ఆ పురుగుకి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే ఇది సాధారణ బారన్ గొంగళి పురుగు మాత్రమే. ఇది బురద–రంగులో ఎక్కువగా ఉంటుంది. సున్నితంగా ఉంటూ అందమైన బారన్ సీతాకోకచిలుకగా మారుతుంది. ఇలా సీతాకోక చిలుకగా మారే క్రమంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. దానిని తాకితే కచ్చితంగా భరించలేని దురద వచ్చే అవకాశం మాత్రమే ఉంది తప్ప.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి చెరుకు తోటలో ఒక ఫొటోతో పాటు ఏదో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల ఫొటోలను జతచేసి పోస్ట్ చేశారు. ఇక ఇది నిజం అని నమ్ముతున్న కొందరు రైతులు పొలాల్లోకి వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి కలిగించారు. ఈ గొంగళి పురుగులు లిమా కోడి డే కుటుంబానికి చెందినవిగా ఎప్పుడో వందేళ్ల క్రితమే గుర్తించారు. ఇతర గొంగళి పురుగుల కంటే ఎక్కువ దురద ఉంటుంది. తేనెటీగలు కుట్టిన అనుభూతి కలుగుతుంది. అంతే గాని ప్రాణాలు తీసే శక్తి ఆ పురుగుకు లేదని తేల్చి స్పష్టమైంది.