Haryana Panchayat Elections: ఒకప్పుడు ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చేవారు. ప్రచారానికి వచ్చిన రాజకీయ నాయకులు వారు గెలిస్తే చేయాల్సిన వాటిపైనే హామీలిచ్చి మాటపై నిలబడేవారు. కానీ.. నేటి రాజకీయాలు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడిస్తున్న హామీలు వింటుంటే చెవులు చెమ్మగిల్లేలా ఉంటున్నాయి. నోటికేదొస్తే అదే మాట్లాడటం.. ఎన్నికలయిన తర్వాత వారిచ్చిన హామీలే వారి తెలియకుండా పోతున్నాయి. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వింటే ముక్కున వేలేసుకోవడం ఖాయం.
హరియాణ పంచాయతీ ఎన్నికల్లో సిర్సాఢీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్ కూడా అదే కోవకు చెందుతాడు. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెబుతూ అతను ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ హమీలను చూసి కొందరికి దిమ్మ తిరిగిపోతోంది.పీఎం, సీఎంలకు సాధ్యం కాని ఈ హామీలను చూసి కొందరు నోరెళ్లబెడుతున్నారు.తనను సర్పంచ్గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ గ్రామస్తులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్ తన గ్రామంలో మూడు ఎయిర్ పోర్టులు, మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై ఇవే కాకా ఇంకెన్నో హామీలిస్తున్నాడు.
జయకరణ్ ఇచ్చిన మరో హామీ చూసి కొందరికి గుండె ఆగినంత పని అయింది. తాను సర్పంచ్ గెలిస్తే సిర్సాఢీ గ్రామం నుంచి గోహాన్ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు. కొందరేమో అది బస్సు అయి ఉంటుందని, పొరపాటున హెలికాప్టర్ అని రాసి ఉంటారని చలోక్తులు విసిరారు. ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి బదిలీ కావాలని ఉందంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో రాజకీయ నాయకులు సైతం తమను మించిన హామీలు గుప్పిస్తున్నాడని చర్చించుకుంటున్నారు.