Star India: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి స్టార్ ఇండియా ఝలక్ ఇచ్చింది. ఇటీవల భారత్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 సిరీస్కు స్టార్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు సంబంధించిన యాడ్ ఇన్వెంటరీ అమ్ముడు కాలేదని.. దీంతో అడ్వర్టైజ్మెంట్స్ కోసం కేవలం మూడు, నాలుగు బ్రాండ్స్ మాత్రమే వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు స్టార్ ఇండియాకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అటు స్టార్ నెట్వర్క్కు చెందిన ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్కు అయితే ఒక్క యాడ్ కూడా రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తమ పూర్తి డీల్లో రూ.130 కోట్లు డిస్కౌంట్ ఇవ్వాలని బీసీసీఐని స్టార్ ఇండియా డిమాండ్ చేసింది. 2018-2023 కాలానికి బీసీసీఐకి స్టార్ ఇండియా రూ.6,138 కోట్లు చెల్లించింది. ఇందులోనే ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతోంది. కరోనా కారణంగా కొన్ని మ్యాచ్లను రీషెడ్యూల్ చేయడం వల్ల కూడా స్టార్ ఇండియాకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
మరోవైపు జెర్సీ స్పాన్సర్, ఎడ్యుకేషనల్ టెకీ సంస్థ బైజూస్ కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని బీసీసీఐకి సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారం హుటాహుటిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. స్టార్ ఇండియా, బైజూస్ సమస్యలపై చర్చించింది. అయితే మార్చి 2023 వరకు కొనసాగాలని బైజూస్ను బీసీసీఐ కోరినట్లు సమాచారం.
బైజూస్ నిర్ణయానికి కారణం ఇదేనా?
షెడ్యూల్ ప్రకారం టీమిండియాకు జెర్సీ స్పాన్సర్గా నవంబర్ 2023 వరకు బైజూస్ కొనసాగాల్సి ఉంది. కానీ మార్కెట్లో నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్ ఇటీవల కాలంలో ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జెర్సీ స్పాన్సర్షిప్ను వదులుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ డీల్ బ్యాంక్ గ్యారంటీ కింద రూ.140 కోట్లను బీసీసీఐకి చెల్లించిన బైజూస్.. మిగతా 160 కోట్లను ఇన్స్టాల్మెంట్లలో చెల్లించనుంది.