NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉన్నాడు. సాధారణంగా బాలీవుడ్ స్టార్లతో పోల్చుకుంటే తెలుగు సినీస్టార్లతో క్రికెటర్లకు పరిచయాలు తక్కువే. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్లో ఉన్నారు. న్యూజిలాండ్తో తొలి వన్డే కోసం హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు హీరో ఎన్టీఆర్ను కలవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ఎన్టీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ను కలిసిన వారిలో సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. అయితే వీళ్లు అనుకోకుండా కలిశారా? లేదా పార్టీ చేసుకోవడం కోసం కలిశారా? అనేది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా ఈ ఫొటో మాత్రం చూడటానికి కలర్ ఫుల్గా ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్టీఆర్తో టీమిండియా క్రికెటర్లు ఫోటో దిగడంతో నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. తమ హీరో రేంజ్ పెరిగిపోయిందని, అస్సలు తగ్గేదే లే అని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తారక్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుందని అభిప్రాయపడుతున్నారు.
రేపు ఉప్పల్లో తొలి వన్డే
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 18న న్యూజిలాండ్తో టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ మూడు రోజుల క్రితమే హైదరాబాద్ నగరానికి చేరుకోగా.. శ్రీలంకతో మూడో వన్డే అనంతరం జనవరి 16న భారత జట్టు నగరానికి చేరుకుంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్కు విశ్వవేదికపై అవార్డుల మీద అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ను కలిసి అభినందనలు తెలిపేందుకు టీమిండియా క్రికెటర్లు వెళ్లినట్లు తెలుస్తోంది.