Indian Team: సాధారణంగా చాలా మంది క్రికెటర్లు ముఖంపై తెల్లటి పౌడర్ పూసుకోవడం ప్రేక్షకులు గమనిస్తుంటారు. మైదానంలోకి వచ్చేటప్పుడు ఇలా ముఖంపై తెల్లటి పూతతో క్రికెటర్లు కనిపిస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారనేది చాలా మందికి తెలియదు. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయట. ఇలా చేయడం వల్ల క్రికెటర్లకు ఉపయోగాలు కలుగుతాయి. పైగా ఈ తరహా జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపుతుంది.
క్రికెటర్లు ఇలా ముఖంపై పూసుకొనే తెల్లటి పౌడర్ను జింక్ ఆక్సైడ్ అని పిలుస్తారు. ఇది పూసుకోవడం వల్ల చర్మంపై రిఫ్లెక్టర్గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల ధాటికి శరీరం దెబ్బతినకుండా ఉంటుంది. యూవీ, యూవీబీ కిరణాలను చర్మంపై నుంచి దూరం చేస్తుంది. క్రికెటర్లు మైదానంలో సుమారు ఆరు గంటలపాటు గడపాల్సి వస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రకాల పనులూ చేయాల్సి ఉంటుంది.
అంత సమయం సూర్మరశ్మి శరీరానికి తగలడం హానికరం. నేరుగా సూర్యుని వేడికి గురవుతారు. దీంతో చర్మాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం జింక్ ఆక్సైడ్ను క్రికెటర్లు వినియోగిస్తారు. వన్డేల్లో అయితే సుమారు 8 గంటల పాటు మైదానంలో గడపాల్సి వస్తుంది. టీ20 మ్యాచ్లలోనూ నాలుగు గంటల పాటు ఉండాలి. అయితే, టెస్టు మ్యాచ్ల విషయానికి వస్తే.. ఏకంగా ఐదు రోజులపాటు సూర్యుని ఎండ నేరుగా క్రికెటర్ల శరీరానికి తగులుతుంది.
సహజమైన పద్ధతిలో చర్మాన్ని రక్షించుకోవచ్చు..
ఈ క్రమంలో చర్మాన్ని రక్షించుకోవడం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా క్రికెటర్లు పాటించాల్సి ఉంటుంది. జింక్ ఆక్సైడ్ వంటి ఫిజికల్ సన్ స్క్రీన్ తో చర్మాన్ని రక్షించుకోవడం అనేది సురక్షితమైన పద్ధతి. జింక్ క్రీములు, తెల్ల రంగులో ఉన్నవి ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పౌడర్ మందపాటి పూత కారణంగా అన్ని యూవీఏ, యూవీబీ కిరణాలను ఫిల్టర్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.