INDvsBAN: రోహిత్, అంపైర్తో నదుల గురించి మాట్లాడావా? షకిబ్కు జర్నలిస్టు తలతిక్క ప్రశ్న
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో బుధవారం అడిలైడ్ వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ను ఓ జర్నలిస్టు విసిగించాడు. తలతిక్క ప్రశ్నలు వేసి అబాసుపాలయ్యాడు. ఈ మ్యాచ్లో వర్షం పడ్డప్పుడు అంపైర్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఏం మాట్లాడావ్..? బంగ్లాదేశ్లో నదుల గురించి చర్చించావా..? అంటూ అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
నిన్నటి మ్యాచ్ అనంతరం పాత్రికేయుల సమావేశానికి వచ్చిన షకిబ్ తో ఓ జర్నలిస్టు..‘వర్షం పడ్డాక మీరు నిజంగా ఈ మ్యాచ్ ఆడాలని భావించారా..?’ అని ప్రశ్నించాడు. దానికి షకిబ్ ‘అంతకుమించి మాకు ఇంకేమైనా ఆప్షన్ ఉందా..?’ అని తెలిపాడు. వాళ్లిద్దరి మధ్య సంభాషణ కొనసాగింపు ఇలా సాగింది.
జర్నలిస్టు : మరి మీరు వాళ్లను కన్విన్స్ చేశారా…?
షకిబ్ : ఎవరిని..?
జర్నలిస్టు : అంపైర్లు, రోహిత్ శర్మను..
షకిబ్ : నాకు అంత సీన్ ఉందా..?
జర్నలిస్టు : మరి మీరు ఏం చర్చించారు. బంగ్లాదేశ్ లో నదుల గురించి మాట్లాడారా..? కొంచెం దాని గురించి వివరంగా చెప్పండి.
షకిబ్..సరే.. ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. వర్షం ఆగాక అంపైర్లు మమ్మల్ని పిలిచారు. టార్గెట్, ఎన్ని ఓవర్లు ఉన్నాయి..? అందుకు సంబంధించిన నిబంధనలు ఏంటి..? అనేది మాతో డిస్కస్ చేశారు.
జర్నలిస్టు : అంతేనా..? మరి మీరు దానికి ఒప్పుకున్నారా..?
షకిబ్ : అవును. ఒప్పుకోకుండా ఇంకేం చేయను.
జర్నలిస్టు : ఓకే థ్యాంక్యూ.. అనడంతో ఈ సంభాషణ ముగిసింది.
అయితే జర్నలిస్టు తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశానికి సారథిగా వ్యవహరిస్తున్న కెప్టెన్ ను పట్టుకుని ఇలాంటి తిక్క ప్రశ్నలేయడం ఏమిటని వాపోతున్నారు. జర్నలిస్టుకు షకిబ్ తన జవాబుతో బుద్దిచెప్పాడని.. మరోమారు అతడిని అనుమతించకుండా ఉండాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరుతున్నారు.