Team India: ఇటీవల కాలంలో టీమిండియాను గాయాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యారు. ఈ జాబితాలో మరో బౌలర్ కూడా చేరాడు. అనారోగ్య కారణాలతో ఖలీల్ అహ్మద్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఖలీల్ అహ్మద్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని.. అందుకే క్రికెట్కు దూరమయ్యానని ఖలీల్ అహ్మద్ ట్వీట్ చేశాడు. రంజీ ట్రోఫీ సీజన్లో చాలా మ్యాచ్లకు దూరంగా ఉండబోతున్నానని తెలిపాడు. అయితే తాను త్వరలోనే కోలుకుని జట్టులోకి తిరిగి వస్తానని వివరించాడు. క్రికెట్కు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే మోకాలి గాయం కారణంగా ఖలీల్ అహ్మద్ ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.
2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్ టీమిండియా తరపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచ్లను ఆడాడు. వన్డేల్లో 15 వికెట్లు, టీ20ల్లో 13 వికెట్లు సాధించాడు. అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన బెట్టారు. ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్ అహ్మద్ గాయాలతో జట్టుకు పూర్తిగా అందుబాటులో ఉండలేకపోయాడు.
ఖలీల్ అహ్మద్ ధర రూ.5.25 కోట్లు
ఐపీఎల్లో ఖలీల్ అహ్మద్ కొన్నాళ్ల పాటు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడాడు. అతడి ప్రదర్శన బాగుండటంతో ఆ తర్వాత 2022 మెగా వేలంలో అతడిని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకు రూ.5.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే ఆశించిన మేర రాణించకపోవడంతో ఇటీవల ఫ్రాంచైజీ నుంచి విడుదల చేసింది. దీంతో మినీ వేలంలో ఖలీల్ అహ్మద్ను ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.