IPL: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం జరగనుంది. ఈ సమయానికి తమ జట్లలో ఎవరిని రిటైన్ చేసుకుంటున్నారు? ఎవరిని వదులుకుంటున్నారు అనే వివరాలను ఆయా ఫ్రాంచైజీలు వెల్లడించాలి. ఈ క్రమంలో పలు ఫ్రాంచైజీలు కీలక ప్రకటన చేస్తున్నాయి. మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను షఫిల్ చేసుకునే పనిలో ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
2022 ఐపీఎల్ మెగా వేలంలో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ శార్దూల్ ఠాకూర్ను కోల్కతా నైట్రైడర్స్కు అమ్మేసింది. ఈ ఏడాది జరిగిన మెగా లీగ్లో 14 మ్యాచ్లు ఆడిన శార్దూల్ ఠాకూర్ 15 వికెట్లు మాత్రమే తీసి 120 పరుగులే చేశాడు. దీంతో ఢిల్లీ యాజమాన్యం అతడిని వదులుకుంది.
శార్దూల్ ఠాకూర్ కోసం చెన్నై, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా ప్రయత్నించాయి. అయితే చివరికి కోల్కతా నైట్రైడర్స్ అతడిని దక్కించుకుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్లను కూడా కోల్కతా ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. దీంతో ఆ టీమ్ మరింత స్ట్రాంగ్గా మారింది.
కోల్కతా నుంచి కీలక ఆటగాడు అవుట్
కోల్కతా టీమ్లో కీలక ఆటగాడు సామ్ బిల్లింగ్స్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ఆడకూడదని నిర్ణయించాడు. టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని అన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన కోల్కతా టీమ్కు థ్యాంక్స్ తెలియజేశాడు.