Chandrababu naidu: 2024 తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రస్తుతం ఏపీలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు చేసిన ఆ మేనిఫెస్టో పై అనేక రకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో మహ19-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ, స్కూలుకెళ్లే ప్రతి చిన్నారికీ అమ్మ ఒడి, రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున సాయం ఇలా చాలా రకాల పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.
సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో ఈ హామీలను ప్రకటించారన్నది స్పష్టంగా వినిపిస్తున్న వార్త. ఉద్యోగులు, పట్టణ ప్రజలు, యువతలో జగన్ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండగా సంక్షేమ పథకాలతో గరిష్ట ప్రయోజనం పొందుతున్న గ్రామీణ జనాభా మాత్రం ఇంకా జగన్ వైపే ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. వారిని తమ వైపు తిప్పుకోవడానికి బాబు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఈ హామీలని అభిప్రాయపడుతున్నారు. ఐతే ఈ హామీల విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను హద్దులు దాటించేశారని, ఏపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి దివాళా తీయించేస్తున్నారని వైసీపీ మీద కొన్నేళ్ల నుంచి తెలుగుదేశం మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాస్త చదువుకున్న, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారి అభిప్రాయం కూడా ఇదే. సంక్షేమ పథకాలు హద్దులు దాటితే జనం సోమరిపోతులుగా మారుతారని స్వప్రయోజనాలు చూసుకుని రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించారని.. కాల క్రమంలో ఇది విధ్వంసానికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఆలోచన ధోరణి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఆయన జగన్ తరహాలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వరనే నమ్మకంతో ఉన్నారు చాలామంది. కానీ జగన్ను మించి ఉచితాలు, సంక్షేమ పథకాలను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ను ఇంత కాలం విమర్శించిన వాళ్లు ఇప్పుడు బాబు ప్రకటించిన హామీల విషయంలో ఏమంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.