Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిర్వహించిన మహానాడు వేదిక తీవ్రంగా నిరాశపరిచింది. కాగా పవన్ ఎప్పుడు మాట్లాడిన ఎప్పుడు పర్యటించినా కూడా పొత్తులు, జగన్ను గద్దె దించడంపై మాట్లాడుతుంటారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా టీడీపీతో పొంత్తు వుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే పవన్ వ్యాఖ్యల పై మహానాడులో టీడీపీ తగిన రీతిలో స్పందిస్తుందని అందరూ ఊహించారు. కానీ రెండు రోజులపాటు జరిగిన మహానాడు సంబరం కనీసం పవన్ కళ్యాణ్ ఊసే ఎత్తకుండా ముగిసిపోయింది.
దాంతో పవన్ కల్యాణ్ను టీడీపీ అసలు పట్టించుకోలేదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నప్పుడు, ఉమ్మడి మేనిఫెస్టో తీసుకురావడం రాజకీయంగా మంచి సంప్రదాయం. అయితే అలాంటి సంప్రదాయాన్ని పవన్ కల్యాణ్ విషయంలో పాటించాల్సిన అవసరం లేదనే రీతిలో టీడీపీ వ్యవహరించిందనే చర్చ నడుస్తోంది. ఎవరితోనూ సంబంధం లేకుండా టీడీపీ సొంత ఎజెండా, జెండాతో అధికారంలోకి వస్తామనే ధీమాను ప్రదర్శించింది. అయితే ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వననే ప్రగల్భాలు పలుకుతున్న పవన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.
తమ వెంట పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడిచేలా రాజకీయంగా టీడీపీ భ్రష్టు పట్టించిందని, ఇక ఆయన్ను అలా వదిలేసిందని అంటున్నారు. టీడీపీ వెంట తనకు తాను నడిచేలా, ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకునేలా పవన్ను టీడీపీ తయారు చేసిందనే చర్చకు తెరలేచింది. అందుకే పవన్ అభిప్రాయాలతో సంబంధం లేకుండా టీడీపీ మేనిఫెస్టో తయారు చేసుకుందని అంటున్నారు. ఇంతకాలం జగన్ పై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న పవన్కల్యాణ్కు టీడీపీ వైఖరి జీర్ణించుకోలేకుండా ఉంది.