RGV-CM Jagan: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా చేతినిండా పని ఉంటూనే ఉంటుంది. అయితే కొంతకాలంగా వర్మ పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తెర వెనుక వర్మ తన పనులు చేస్తూ పోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పన్నెండు లక్షలు అద్దె చెల్లిస్తూ 5 అంతస్తుల భవనంలో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో రెండు కూడా పొలిటికల్ సినిమాలు కావడం గమనార్హం. పొలిటికల్ హీట్ పెంచడానికే ఈ రెండు సినిమాలు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే రెండు సినిమాలకు పొలిటికల్ లీడర్లే పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సినిమాకి ఎంపీ మిధున్ రెడ్డి సపోర్ట్ అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమా పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాతో జగన్ పరువే పోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే మరో సినిమా బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్కు అనుకూలంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ ఫండింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలతోపాటు తనదైన స్టైయిల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్తో కలిసి ఓ సినిమా తీయబోతున్నారు. అయితే ఈ మూడు సినిమాలకు 50 కోట్లకు పైగా బడ్జెట్ ఉండనుంది. అందుకే పెద్ద ఆఫీస్ను ఓపెన్ చేసి.. పనుల్లో వేగం పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లారు. విజయవాడ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడటానికి ఆర్జీవీ నిరాకరించారు. గన్నవరం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.