Jio Offer: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ధన్తేరాస్ వేళ బిగ్ ప్రకటన చేసింది. 5జీ సేవలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఇప్పుడు జియో ట్రూ 5జీ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే 5జీ వైఫై సేవలను ప్రారంభించింది. వీటితో పాటు మరో రెండు నగరాలకు జియో 5జీ సేవలను తీసుకొచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. రాజస్థాన్లోని పుణ్యక్షేత్రం నాథ్ద్వారాను సందర్శించిన ఆకాశ్ అంబానీ అక్కడే ప్రకటించారు. ఇప్పుడు రిలయన్స్ జియో 5జీ సేవలు నాథ్ద్వారాతో పాటు చెన్నైకి విస్తరించినట్లు అంబానీ వెల్లడించారు.
జియో వెల్కమ్ ఆఫర్ కింద దేశంలోని 6 ప్రధాన నగరాలు జియో ట్రూ 5జీ సేవలను పొందొచ్చని ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. ఆకాశ్ అంబానీ ఆయన సతీమణి శ్లోకాతో కలిసి నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించారు. లార్డ్ శ్రీనాథ్జీ ఆశీస్సులతోనే ఇవాళ జియో 5జీ వైఫై సేవలను నాథ్ద్వారాలో ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే దిల్లీ, ముంబయి, కోల్కతా, వారణాసిలో జియో 5జీ సేవలను తీసుకురాగా ఇప్పుడు చెన్నై, నాథ్ద్వారాలకు విస్తరించింది. దీంతో త్వరలోనే ప్రతి నగరంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని, ఆకాశ్ అంబానీ వెల్లడించారు. జియో ఇవాళ ట్రూ 5జీ నెట్వర్క్పై 5జీ సేవలను ప్రారంభించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడి ఉండే విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమర్షియల్ హబ్స్ వంటి ప్రాంతాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలను తీసుకొచ్చింది. ఇది నాథ్ద్వారాలోనే తొలుత ప్రారంభమైంది. జియో వెల్కమ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా జియో యూజర్లు వీటిని ఉచితంగానే పొందొచ్చని వివరించింది.
భారత్లో అక్టోబర్ 1 నుంచే 5జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో బీటా ట్రయల్స్ కింద 5జీ నెట్వర్క్ను ఆయా టెలికాం కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ తొలుత 12 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాస్త ఆలస్యంగా రిలయన్స్ జియో 5జీ సేవలను తొలుత 4 నగరాల్లో, తర్వాత ఇప్పుడు మరో 2 నగరాలకు విస్తరించింది. అయితే.. సిమ్ 4జీ అయినా 5జీ సపోర్ట్ చేస్తుంది కానీ.. ఫోన్ మాత్రం కచ్చితంగా 5జీకి సపోర్టు చేస్తుండాలని వెల్లడించారు.