KA Paul: మునుగోడు ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దిగిన విషయం తెలిసిందే. కేవలం 900కు పైగా ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. నోటాకు 800 ఓట్లు రాగా… కేఏ పాల్ కు 900 వచ్చాయి. దీంతో నోటాతో కేఏ పాల్ ఓట్లను పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాయని, ఈ ఉపఎన్నికను రద్దు చేయాలంటూ కేఏ పాల్ డిమాండ్ చేస్తోన్నారు. ఉపఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానంటూ ఇటీవల చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి మునుగోడు ఉపఎన్నికపై కేఏ పాల్ స్పందించారు. మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలంటూ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. పోలింగ్ రోజు ఈవఎంలు రీప్లేస్ అయ్యాయనే విషయం అందరికీ తెలుసంటూ బాంబ్ పేల్చారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ నిర్వహించాలని తాను డిమాండ్ చేశానని, కానీ ఎందుకు కౌంటింగ్ చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.
కేటీఆర్ కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం నిలబడవని, పైన దేవుడు తీర్పు కఠినంగా ఉంటుందని కేఏ పాల్ హెచ్చరించారు. తమ్ముంటే కేటీఆర్ తనలాగా రోడ్డుపైకి వచ్చి తిరగాలని కేఏ పాల్ సవాల్ విసిరారు. తాను వెనకడుగు వేయనని, తన పోరాటం కొనసాగిస్తానంటూ పాల్ చెప్పారు.మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అక్రమంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలిచిందని పాల్ ఆరోపించారు. పోలీసులు, ఈసీ అధికారులందరూ టీఆర్ఎస్ కు మద్దతుగా పనిచేశారని, టీఆర్ఎస్ గెలుపు ఒక గెలుపు కాదని పాల్ తెలిపారు.