Karimnagar: మనుషులు మనం సమాజంలో మనగలుగుతున్నామంటే దానికి కారణం మనలోని మానవత్వమే. అయితే మనలో చాలామంది అప్పుడప్పుడు మానవత్వాన్ని మర్చి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. మానవత్వం మరిచిన ఇలాంటి మనుషుల వల్ల సమాజం మీద విసుగుపుడుతుంటుంది. ఓ ఇంటి యజమాని వల్ల ఓ కుటుంబం ఎలాంటి దీనస్థితిలో ఉండిపోయిందో కింద చదవండి.
కరీంనగర్ కు చెందిన బస్వరాజు కనకయ్య అనే వ్యక్తికి చాలాకాలంగా అనారోగ్యం ఉంది. అతడి రెండు కిడ్నీలు పాడైపోగా అతడికి వైద్యం చేయించే స్థితిలో అతడి కుటుంబం లేదు. అతడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా, ఒక ఆడ బిడ్డ దివ్యాంగురాలు. బస్వరాజు కనకయ్యకు వైద్యం అందించినా బ్రతకడని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
అయితే కనకయ్య ఉంటున్న ఇంటి ఓనర్ మాత్రం ఇంట్లోకి అతడిని తీసుకురావడానికి వీలు లేదని హెచ్చరించాడు. దాంతో ఆ భార్య, తన ఇద్దరు కూతుళ్లను, భర్తను తీసుకొని స్మశానానికి వెళ్లింది. కొన ఊపిరితో ఉన్న బస్వరాజు కనకయ్య స్మశానంలో కాలిన శవాలను చూస్తూ, తన దీనస్థితిని తలుచుకొని కన్ను మూశాడు.
బస్వరాజు కనకయ్య మరణం తర్వాత మైల ఉంటుందని, కాబట్టి ఇప్పుడే ఇంట్లోకి రావడానికి వీలులేదని ఆ ఓనర్ మరోసారి హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లి, కూతుళ్లు స్మశానంలోనే ఉంటున్నారు. వచ్చీ పోయే శవాలను చూస్తూ.. బ్రతికున్నా తాము శవాలుగా మారామని శోకంలో మునిగిన ఘటన అందరినీ కలచి వేస్తోంది.