KLRahul: బుధవారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను క్వీన్ స్వీప్ చేయడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. ఈ సిరీస్కు గాయం కారణంగా రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ పగ్గాలు స్వీకరించనున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో గెలవాలంటే ఏం చేయాలో తమకు తెలుసు అని చెప్పాడు. ఈ సిరీస్లో దూకుడే తమ మంత్రం అని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో టీమిండియా ఉందని.. ఈ టోర్నీలో ఫైనల్ చేరాలంటే తాము ఈ సిరీస్లో దూకుడుగా ఆడాల్సిందేనని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. ప్రతి రోజు, ప్రతి సెషన్లో నిర్దిష్ట సమయంలో టీమ్కు ఏం అవసరమో అంచనా వేస్తూ ఆటగాళ్లందరూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని రాహుల్ అన్నాడు. ఐదు రోజుల మ్యాచ్ కాబట్టి చిన్న చిన్న టార్గెట్లు నిర్దేశించుకుని వాటిని సాధించుకుంటూ వెళ్తే ఫలితం తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందన్నాడు.
పాకిస్థాన్లో ఇంగ్లండ్ పర్యటించడం శుభపరిణామం అని.. ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోందని రాహుల్ చెప్పాడు. భయం లేకుండా ఆడుతున్న ఇంగ్లండ్ కాన్సెప్ట్ బాగుందని ప్రశంసించాడు. మరోవైపు వైస్ కెప్టెన్గా పంత్ స్థానంలో పుజారాను నియమించడంపైనా రాహుల్ స్పందించాడు. వైస్ కెప్టెన్ ఎవరైనా జట్టులో పెద్దగా మార్పు కనిపించదని.. ఇది చాలా చిన్నవిషయమని కొట్టిపారేశాడు. రెండో టెస్టు నాటికి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ తిరిగివస్తాడనే ఆశాభావంతో ఉన్నామని రాహుల్ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీలో భారత్ ర్యాంక్ ఎంత?
ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆసక్తికరంగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో శ్రీలంక, నాలుగో స్థానంలో భారత్ ఉన్నాయి. భారత్ రెండో స్థానానికి రావాలంటే బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో విజయం సాధించడం చాలా ముఖ్యం. ఆరు టెస్టుల్లో టీమిండియా కనీసం ఐదు మ్యాచ్లలో గెలవాల్సి ఉంటుంది.