Kodali Nani: సినిమాలకు, రాజకీయాలకు ఎంతో అవినాబావ సంబంధం ఉంటుంది. గతంలో సినిమాల్లో చేసిన ఎంతో మంది రాజకీయాలు చేయగా.. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే చాలా సినిమాలు పొలిటికల్ హీట్ ని కూడా పెంచుతుంటాయి. ఈ కోవలోకి తాజాగా విడుదలైన బాలయ్య బాబు సినిమా ‘వీరసింహారెడ్డి’ కూడా వస్తుంది. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుండగా.. ఇందులోని డైలాగులు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.
ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ‘వీరసింహారెడ్డి’ సినిమాలో డైలాగులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీని గురించి తాజాగా అధికార పార్టీకి చెందిన నాయకుడు కొడాలి నాని స్పందించారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని డైలాగుల వల్ల జగన్ కు కానీ, ప్రభుత్వానికి కానీ వెంట్రుక కూడా ఊడదు అని కొడాలి నాని ఘాటుగా స్పందించాడు. ప్రజలకు మంచి చేయాలన్న తమ కార్యక్రమాలను చేసుకుంటూపోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
సినిమాలు అంటే రంగులు పూసుకొని, నాలుగు డైలాగులు రాసుకొని, కెమెరాల ముందు చేసే యాక్టింగ్ అన్న కొడాలి నాని.. బాలయ్య లాంటి వాళ్లు రీల్ హీరోలు అని, కానీ జగన్ మాత్రం రియల్ హీరో అని వెల్లడించారు. ఇప్పుడు వచ్చిన వీరసింహారెడ్డి సినిమా గురించి నాలుగు రోజులు మాట్లాడుకొని తర్వాత వదిలేస్తారని అన్నారు.
గతంలో కూడా బాలయ్య ఎన్నో సినిమాలు చేశాడని కానీ వాటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారా అని కొడాలి నాని ప్రశ్నించారు. అలాగే వీరసింహారెడ్డి సినిమా గురించి కూడా మూడు రోజులు మాట్లాడుకొని తర్వాత అందరూ మర్చిపోతారన్నారు. జనాలు సినిమాను మర్చిపోతారు, హీరోను మర్చిపోతారు, డైలాగులను మర్చిపోతారు అని కొడాలి నాని స్పష్టం చేశారు.